ఏడాదికోసారి క్రికెట్ అభిమానుల మదిదోచే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఈసారి ఏడాది తిరక్కుండానే మూడోసారి ముందుకొచ్చింది..! కరోనా కారణంగా 13వ సీజన్ ఐదు నెలలు ఆలస్యంగా గత సెప్టెంబర్లో షురూ అవగా.. ఈ ఇయర్ ఏప్రిల్లో మొదలైన 14వ ఎడిషన్ కరోనా వల్లే అర్ధంతరంగా ఆగిపోయింది..! అనుకోకుండా వచ్చిన నాలుగు నెలల గ్యాప్ తర్వాత యూఏఈ గడ్డపై ఐపీఎల్ హంగామా మళ్లీ మొదలవుతోంది..! మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్స్ ముంబై ఇండియన్స్–చెన్నై సూపర్ కింగ్స్ మధ్య నేడు జరిగే బ్లాక్బస్టర్ ఫస్ట్ ఫైట్తో లీగ్ ఫేజ్2 రీస్టార్ట్ అవుతోంది..! 2019 తర్వాత లీగ్ మళ్లీ ఫ్యాన్స్ సమక్షంలో జరగడం అందరికీ కిక్ ఇస్తోంది..! పేరుకు 14వ ఎడిషన్ కొనసాగింపే అయినా.. సెకండాఫ్ ముందు చాలా మార్పులు జరిగాయి..! కాబట్టి ఫేజ్2 సరికొత్తగా సాగడం పక్కా! మరి, ఫస్టాఫ్లో టాప్4 జట్ల జోరు అరబ్ గడ్డపై కొనసాగుతుందా? లేక చివరి ప్లేస్ల్లో నిలిచిన టీమ్స్ ప్లే ఆఫ్స్ రేసులో దూసుకొస్తాయా?
దుబాయ్: ధనాధన్ క్రికెట్ వార్ మళ్లీ వచ్చేసింది. క్రికెట్ ఫ్యాన్స్కు కిక్ ఇచ్చే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తిరిగొచ్చి్ంది. ఐపీఎల్ 14వ ఎడిషన్ కరోనా కారణంగా మధ్యలోనే ఆగిపోగా.. కొంత విరామం తర్వాత అరబ్ గడ్డపై మరోసారి అలరించేందుకు రెడీ అయింది. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఆదివారం జరిగే మ్యాచ్తో ఫేజ్కు తెరలేస్తోంది. వచ్చే నెలలో ఇదే అరబ్ గడ్డపై టీ20 వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో అన్ని దేశాల ప్లేయర్లు ఐపీఎల్పై ఫోకస్ పెట్టారు. లీగ్లో రాణించడంతో పాటు ఇక్కడి వెదర్, పిచ్లకు అలవాటు పడాలని చూస్తున్నాయి. అదే టైమ్లో ఫ్రాంచైజీ తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకొని టీమ్కు టైటిల్ అందించాలని పట్టుదలగా ఉన్నారు. వరల్డ్కప్నకు ఇప్పటికే అన్ని దేశాలు తమ జట్లను ప్రకటించాయి. అయితే, గాయాల కారణంగా చివర్లో ఏమైనా మార్పులు చేసేందుకు అక్టోబర్ 10 వరకు ఐసీసీ గడువు ఇవ్వడంతో ఐపీఎల్ పెర్ఫామెన్స్తో ఆ చాన్స్ కొట్టేయాలని ఇండియన్స్తో పాటు ఫారిన్ ప్లేయర్లు భావిస్తున్నారు. ఈ ఎడిషన్లో మరో 31 మ్యాచ్లు మిగిలాయి. అక్టోబర్ 8 వరకు లీగ్ మ్యాచ్లు షెడ్యూల్ చేయగా.. 10, 11, 13వ తేదీల్లో ప్లే ఆఫ్స్, 15న దుబాయ్లో ఫైనల్తో మెగా లీగ్ ముగుస్తుంది.
ఫేజ్2లో ఫేట్ మారుతుందా?
14వ సీజన్ ఫస్టాఫ్లో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ 8 మ్యాచ్లు ఆడగా.. మిగతా ఆరు జట్లు ఏడేసి మ్యాచ్లు ఆడాయి. ఫస్టాఫ్లో ఢిల్లీ ఆరు విక్టరీలతో టాప్ ప్లేస్ సాధించగా.. పోటాపోటీగా ఆడిన చెన్నై, బెంగళూరు చెరో ఐదు విక్టరీలతో 2,3 ప్లేస్ల్లో ఉన్నాయి. ముంబై నాలుగో ప్లేస్లో ఉండగా.. రాజస్తాన్, పంజాబ్, కోల్కతా, సన్రైజర్ చివరి నాలుగు స్థానాల్లో నిలిచాయి. సరిగ్గా సగం మ్యాచ్లు మిగిలుండటంతో సెకండ్ ఫేజ్ రసవత్తరంగా సాగే చాన్సుంది. కింది వరుసలో ఉన్న జట్లు పుంజుకొని టాప్–4లోని టీమ్స్కు సవాల్ విసరొచ్చు. యూఏఈలో సమయం గడుస్తున్నకొద్దీ పిచ్లు నెమ్మదిస్తూంటాయి. అయితే, ఇప్పుడు 31 మ్యాచ్లే ఉండటంతో టోర్నీలో చాలా వరకూ పిచ్లు మన్నికంగా ఉండొచ్చు. వికెట్ల ప్రభావం తగ్గి కేవలం జట్ల పెర్ఫామెన్స్ మాత్రమే ఫోకస్ ఉండనుంది. ఈ నేపథ్యంలో ఫస్టాఫ్ జోరును కొనసాగించి తమ జట్టుకు తొలి టైటిల్ అందించాలని ఆర్సీబీ కెప్టెన్ కోహ్లీ పట్టుదలగా ఉన్నాడు. వరల్డ్ కప్ తర్వాత ఇండియా టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్న నేపథ్యంలో ఐపీఎల్ ట్రోఫీ నెగ్గితే వరల్డ్ కప్లో ఫుల్ కాన్ఫిడెన్స్తో ఇండియాను నడిపిస్తాడు. లాస్ట్ ఇయర్ రన్నరప్గా నిలిచి ఫస్ట్ ఫేజ్లో టాప్ లేపిన ఢిల్లీ అదే జోరుతో విజేతగా నిలవాలన్న కృత నిశ్చయంతో ఉంది. . ఇక, ఐదు సార్లు విన్నర్ ముంబై ఇండియన్స్ ఆరో టైటిల్పై గురిపెట్టింది. అయితే, మరో ఏడు మ్యాచ్లే మిగిలున్న నేపథ్యంలో అలవాటు ప్రకారం ఈ ఫేజ్ను నెమ్మదిగా మొదలు పెడితే తన టార్గెట్ను అందుకోలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ ఫామ్లో ఉండగా.. వరల్డ్ కప్కు ఎంపికైన యంగ్స్టర్స్ సూర్యకుమార్, ఇషాన్ కిషన్, రాహుల్ చహర్ జోష్లో కనిపిస్తున్నాడు. ఇక, 13వ సీజన్ చెత్త ఫెర్ఫామెన్స్ నుంచి కోలుకున్న ధోనీ కెప్టెన్సీలోని సీఎస్కే ఫస్టాఫ్లో అదరగొట్టింది. ఫేజ్1లో యంగ్స్టర్స్ రుతురాజ్, సామ్ కరన్, స్పిన్నర్లు తాహిర్, మొయిన్ అలీ, జడేజా రాణించగా.. ఇప్పుడు స్టార్ ప్లేయర్లు ధోనీ, సురేశ్ రైనా సత్తా చాటితే ఆ టీమ్కు తిరుగుండదు. ఇక, తొలి దశలో పేలవ ఆటకు తోడు ఇప్పుడు కీలక ప్లేయర్ల విత్డ్రా అవడంతో డీలా పడ్డ పంజాబ్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్ సెకండాఫ్లో ఏమాత్రం పోటీ ఇస్తాయో చూడాలి. ఇక, ఏడు మ్యాచ్ల్లో ఒక్కటే నెగ్గి చివరి ప్లేస్లో ఉన్న సన్రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ చేరాలంటే అద్భుతం చేయాల్సిందే. స్టార్ ఓపెనర్ బెయిర్స్టో లేని ఆ జట్టు ఎలా పుంజుకుంటుందన్నది ఆసక్తికరం.
అవాంతరాలు దాటుకొని..అభిమానుల ముందుకొచ్చి
ఏప్రిల్–మేలో కరోనా అడ్డొచ్చే వరకూ మెగా లీగ్లో 29 మ్యాచ్లు జరగ్గా.. బిజీ ఇంటర్నేషనల్ షెడ్యూల్లోనూ మిగతా 31 మ్యాచ్లను బీసీసీఐ యూఏఈకి షిఫ్ట్ చేసింది. ఈ క్రమంలో అనేక అవాంతరాలను దాటుకొని వచ్చింది. ఇంగ్లండ్ టూర్ సందర్భంగా టీమిండియా చీఫ్ కోచ్ రవిశాస్త్రి సహా పలువురు కరోనా బారిన పడటంతో లీగ్కు ముందు ఆందోళన కలిగించినా.. ఇండియాతో పాటు ఇంగ్లండ్ ప్లేయర్లు సేఫ్గా అరబ్ కంట్రీకి చేరుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక, గతేడాది సరిగ్గా ఇదే సెప్టెంబర్ 19న మొదలైన ఐపీఎల్ 13 ఎడిషన్ మొత్తాని యూఏఈలో ఎలాంటి అంతరాయం లేకుండా జరిగింది. ఈ నేపథ్యంలో ఫేజ్2 కూడా సాఫీగా సాగుతుందని బోర్డు నమ్మకంగా ఉంది. ఫేజ్2కు పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను అనుమతించడంతో లీగ్కు సరికొత్త కళ రానుంది.