
- రా. 7.30 నుంచి స్టార్స్పోర్ట్స్లో
లక్నో: ఐపీఎల్–18 లీగ్ దశకు ఆఖరి పంచ్ ఇచ్చేందుకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) రెడీ అయింది. మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగే చివరి లీగ్ మ్యాచ్లో ఆర్సీబీ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఈ పోరులో నెగ్గి టాప్-2 ప్లేస్తో నేరుగా క్వాలిఫయర్-1 ఆడాలని భావిస్తోంది. మరోవైపు ఈ సీజన్లో పెద్దగా రాణించని లక్నో తమ ఆఖరాటలో గెలిచి మంచి ముగింపు ఇవ్వాలని చూస్తోంది. ప్రస్తుతం 17 పాయింట్లతో నిలిచిన ఆర్సీబీ ఈ మ్యాచ్ గెలిస్తే టాప్-–2లో నిలిచే అవకాశం ఉంది.
గత మ్యాచ్లో సన్ రైజర్స్ చేతిలో ఓటమి నుంచి తేరుకొని లక్నో పని పట్టాలని ఆ జట్టు కోరుకుంటోంది. ఆస్ట్రేలియా పేసర్ జోష్ హేజిల్వుడ్ (10 మ్యాచ్ల్లో 18 వికెట్లు) రాక జట్టుకు బలం చేకూర్చింది. మరోవైపు గత మ్యాచ్లో గుజరాత్పై భారీ విజయం సాధించిన లక్నో ఆత్మవిశ్వాసంతో ఉంది. మార్క్రమ్, మార్ష్, పూరన్ సూపర్ ఫామ్లో ఉండటం ఆ జట్టుకు ప్లస్ పాయింట్.