
హైదరాబాద్ నుంచి జబల్పూర్కు తరలించిన గుర్రాల మరణాలు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ నుంచి 57 గుర్రాలను మధ్యప్రదేశ్లోని జబల్పూర్కు అక్రమంగా తరలించారు. 57 గుర్రాల్లో 8 గుర్రాలు మృతి చెందడం తీవ్ర చర్చకు దారితీసింది. ఐపీఎల్ తరహాలో HPSL (హార్స్ పవర్ స్పోర్ట్స్ లీగ్) నిర్వహణకు హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త సురేష్ పాలడుగు సన్నాహాలు చేశాడు. అందులో భాగంగానే.. హైదరాబాద్ నుంచి జబల్పూర్లోని సచిన్ తివారీ ఫార్మ్కు గుర్రాలను తరలించారు. మాల్ న్యూట్రిషన్ కారణంగా 8 గుర్రాలు మృతి చెందాయి. గుర్రాల మృతిపై మధ్య ప్రదేశ్ హైకోర్టులోనూ ఇప్పటికే పిటిషన్ దాఖలైంది. పలు రేస్ క్లబ్స్ సపోర్ట్తో దేశంలోని ప్రముఖ నగరాల్లో ఈ HPSL నిర్వహించాలని సురేష్ పాలడుగు ప్లాన్ చేశాడు.
ఫిలిప్పైన్స్లో కూడా గుర్రాల పోటీలు నిర్వహించాలని డిసైడ్ అయి HithaNet India Pvt Ltd అనే సంస్థతో గుర్రాలకు ట్రైనింగ్ ఇప్పించాడు. హార్స్ రేసింగ్ను బెట్టింగ్ స్టైల్ నుంచి ఎంటర్టైన్మెంట్ స్టైల్కు మార్చేందుకే ఈ HPSL పోటీలకు ఆలోచన చేసినట్లు సురేష్ పాలడుగు చెప్పుకొచ్చాడు. ఆ గుర్రాల్లో ఏవీ తన సొంతవి కావని.. అవన్నీ HithaNet అనే సంస్థకు చెందినవేనని సురేష్ పాలడుగు తెలిపాడు. టెక్నికల్ సపోర్ట్తో పాటు HPSL స్ట్రీమింగ్, రేస్ క్లబ్స్తో డీల్ చేయడం మాత్రమే తన బాధ్యత అని చెప్పాడు. హైదరాబాద్ నుంచి జబల్పూర్కు గుర్రాలను తరలించడంపై HithaNet సంస్థ స్పందించింది.
హైదరాబాద్ రేస్ క్లబ్తో తమ లీజ్ ముగిసిందని.. అందుకే జబల్పూర్కు గుర్రాలను తరలించామని HithaNet కంపెనీలో కీలకంగా వ్యవహరిస్తున్న పావని గడ్డం తెలిపారు. గుర్రాలను హైదరాబాద్ నుంచి తరలించిన సమయంలో ఆరోగ్యంగానే ఉన్నాయని.. రోడ్డు మార్గంలో గుర్రాలను తరలించామని.. గుర్రాలకు ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఆమె చెప్పారు. ఈ HPSL ముగిశాక గుర్రాలను తిరిగి హైదరాబాద్ కు తరలిస్తారా అనే ప్రశ్నకు ఆమె బదులిస్తూ.. అలా అని కచ్చితంగా చెప్పలేమని, ఆ గుర్రాలను బ్రీడింగ్ కోసం, సినిమాల కోసం వినియోగించుకునే అవకాశం ఉందని.. అవసరమైతే గుర్రాలను అమ్మేస్తామని పావని గడ్డం తెలిపారు.