OTT Crime: మూడు ఓటీటీల్లోకి తెలుగు క్రైమ్ డ్రామా.. వ్యవస్థను ప్రశ్నించే కథకు మంచి రెస్పాన్స్

OTT Crime: మూడు ఓటీటీల్లోకి తెలుగు క్రైమ్ డ్రామా.. వ్యవస్థను ప్రశ్నించే కథకు మంచి రెస్పాన్స్

మల్లేశం, 8 ఎ.ఎమ్ మెట్రో చిత్రాల తర్వాత దర్శకుడు రాజ్ రాచకొండ తెరకెక్కించిన చిత్రం ‘23’.తేజ, తన్మయి ప్రధానపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటికి చెందిన స్టూడియో 99 సంస్థ నిర్మించింది. స్పిరిట్ మీడియా డిస్ట్రిబ్యూషన్ చేసింది. మే16న థియేటర్లలలో విడుదలై మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. మూడు యథార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కిన ‘23’మూవీ ఓటీటీకి వచ్చేసింది.

1991 చుండూరు ఊచకోత, 1993 చిలకలూరి పేట బస్సు అగ్నిప్రమాదం, 1997 జూబ్లీహిల్స్ కారు బాంబు దాడి.. ఇలా 3 ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. కేవలం ఘటనలనే చూపించడం కాకుండా, వాటి వెనుక ఉన్న ఆందోళన, జరిగిన దారుణ హింస కళ్ళకు కట్టినట్లుగా మూవీను దర్శకుడు రాజ్ ఆర్ తెరకెక్కించాడు. 

అగ్ర వ‌ర్ణాలు, అణ‌గ‌దొక్క‌బ‌డుతున్న వ‌ర్గాల మ‌ధ్య అంతరమే ఈ సినిమా. ఒక ఘటన తర్వాత మరొకటి చూపిస్తూ ఒకరికి తక్కువ శిక్ష.. మరొకరికి ఎక్కువ శిక్ష ఎందుకు పడింది అనేది చర్చించడమే మూవీ మెయిన్‌‌‌‌‌‌‌‌ కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌. ఈ ఘటనలు జరిగి చాలా కాలమైనా పరిస్థితులు ఏమీ మారలేదు.

ఒక తప్పు జరిగితే ఒక వ్యక్తికి 24 గంటల్లో బెయిల్ వస్తోంది. అదే తప్పు చేసిన మరొకరికి రెండేళ్ళకి కూడా బెయిల్‌‌‌‌‌‌‌‌ రాదు. అందుకే ఈ సమస్య ఇప్పటికీ రిలెవంట్‌‌‌‌‌‌‌‌గానే ఉంది. చట్టం అందరికీ సమానంగా వర్తించాలి. కానీ అలా ఎందుకు జరగడం లేదని వ్యవస్థను ప్రశ్నించడమే ఈ సినిమా ముఖ్య ఉద్దేశం. 

‘23’ ఓటీటీ:

మూడు యథార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కిన ‘23’మూవీ ఓటీటీకి వచ్చేసింది. ఏకంగా మూడు ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో స్ట్రీమింగ్ వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా చూసే ఓటీటీల్లోనే అడుగుపెట్టింది. ఆహా, ఈటీవీ విన్, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి ఓటీటీల్లో స్ట్రీమింగ్‍కు ఆందుబాటులో ఉంది. 

సమాజంలో అత్యంత దారుణంగా జరిగిన ఈ మూడు ఘటనలు రహస్యాన్ని.. అందరికీ చేరువ చెయ్యాలనే ఉద్దేశ్యంతోనే మూడు ఓటీటీల్లోకి తీసుకొచ్చారు మేకర్స్. ఈ క్రమంలో సినిమా చూస్తున్న ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. థియేటర్లో మిస్ అయ్యామంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. 

కథేంటంటే:

1991 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చుండూరులో కథ మొదలవుతుంది. ఓ థియేటర్లో సినిమా చూస్తున్న ఒక దళితుడు అనుకోకుండా ఒక పెద్దింటి అమ్మాయి కాలు తొక్కుతాడు. దాంతో ఆ దళితుడు తప్పయింది.. క్షమించమని అడుగుతాడు. అక్కడితో ఆగకుండా అగ్ర కులం వాళ్లు ఆ దళితున్ని విచక్షరహితంగా కొట్టి, పోలీసు స్టేషనులో కేసు పెడతారు. అలా ఈ గొడవ పెద్దదైపోయి ఆ ఊర్లో ఉన్న మరో 8 మంది దళితుల్ని వెంటాడి చంపేలా మారణకాండ సృష్టిస్తారు.

ఈ క్రమంలోనే.. 1993లో గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో దళిత కుటుంబానికి చెందిన సాగర్ (తేజ), సుశీల (తన్మయ) ప్రేమించుకొంటారు. సాగర్కు దాస్ అనే ఒక స్నేహితుడు ఉంటాడు. సుశీలను పెళ్లి చేసుకుని బ్రతకడం కోసం ఇడ్లీ కొట్టు పెట్టుకోవాలని చూస్తాడు.

కానీ, అడుగడున డబ్బుల సమస్య ఎదురువుతోంది. ఈ క్రమంలో అతని స్నేహితుడితో కలిసి బస్సు దోపిడీ చేయాలనీ నిర్ణయించుకుంటాడు. బస్సులో ఉన్న ప్రయాణికులను బెదిరించి, భయపెట్టడానికి వారి వెంట పెట్రోల్ తీసుకుని వెళ్లగా.. బస్సులో పెట్రోల్ పోసి.. కంగారులో అంటించేస్తాడు సాగర్.

అందులో ఉన్న 23 మంది అక్కడికక్కడే సజీవ దహనం అయిపోతారు. చిన్న పిల్లలు కూడా ఉంటారు. ఇంతటి మరణహోమానికి కారణమైన వీరికి కోర్ట్ ఉరి శిక్ష వేస్తుంది. అయితే ఇది జరిగిన నాలుగేళ్లకు అంటే 1997లో జూబ్లీ హిల్స్ బాంబు బ్లాస్టులో 28 మంది అమాయకులు చనిపోతారు. ఈ మూడు ఘటనల నేపథ్యంలో జరిగిన ఉదాంతం ఏదైతే ఉందో.. అది ఉహించడానికి కూడా కష్టతరమైంది. బాధితుల వేదన తీరనిది. 

ఇలా 1991 చుండూరు మారణకాండ, 1993 చిలకలూరిపేట బస్సు దహనం, 1997 జూబ్లీ హిల్స్ బాంబు బ్లాస్టు కేసుల్లో న్యాయస్థానం ఎలాంటి తీర్పును ఇచ్చింది? అగ్ర వ‌ర్ణాలు, అణ‌గ‌దొక్క‌బ‌డుతున్న వ‌ర్గాల ప్రజల పక్షాన న్యాయం నిలబడిందా? మూడు ఘ‌ట‌న‌ల్లోనూ ఉన్న నేరస్థులకు భారత న్యాయస్థానాలు ఎటువంటి శిక్షలు విధించాయి? అనేది మిగతా స్టోరీ.