- అందుబాటులోకి భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్లు హైదరాబాద్ నుంచి నాలుగు ప్రత్యేక రైలు యాత్రలు
మహబూబ్నగర్/మహబూబ్నగర్ అర్బన్, వెలుగు: వేసవి సెలవుల్లో పర్యటనలు, తీర్థయాత్రలు చేయాలనుకునే వారి కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ) ప్రత్యేక సమ్మర్ టూర్ ప్యాకేజీలను ప్రకటించింది. ఈ ప్యాకేజీల కింద ‘భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్స్’ను నడపనుంది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ప్రజల కోసం హైదరాబాద్ నుంచి ఏప్రిల్ 28 నుంచి జూన్ 12 వరకు నాలుగు టూర్ ప్యాకేజీలుగా యాత్రలను నిర్వహించనున్నారు. ఆన్లైన్ లేదా సమీప రైల్వే స్టేషన్లలో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
ప్యాకేజీ-1: పూరి, కోణార్క్, బైద్యనాథ్ ధామ్, వారణాసి, అయోధ్య, కాశీ, ప్రయాగరాజ్ ప్రాంతాలు. ఈ యాత్ర ఏప్రిల్ 28 నుంచి మే 7 వరకు ఉంటుంది. టికెట్ ధరలు జనరల్ రూ.16,700, ఏసీ(3ఏ) రూ.26,100, ఏసీ(2ఏ) రూ.34,100. రైలు సికింద్రాబాద్ నుంచి ప్రారంభమై కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, గుడివాడ, భీమవరం, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం మీదుగా వెళ్తుంది.
ప్యాకేజీ-2: మధుర, బృందావన్, హరిద్వార్, మాతా వైష్ణోదేవి, రిషికేశ్ ప్రాంతాలు. ఈ యాత్ర మే 12 నుంచి మే 21 వరకు ఉంటుంది. జనరల్ టికెట్ రూ.16,500, ఏసీ(3ఏ) రూ.25,700, ఏసీ(2ఏ) రూ.33,400. రైలు సికింద్రాబాద్ నుంచి ప్రారంభమై భువనగిరి, జనగాం, కాజీపేట, పెద్దపల్లి, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్ నగర్, బల్హర్ష, నాగ్పూర్ మీదుగా ప్రయాణిస్తుంది.
ప్యాకేజీ-3: తిరువణ్ణామలై(అరుణాచలం), రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రిచి, తంజావూరు, చిదంబరం ప్రాంతాలు. ఈ యాత్ర మే 24 నుంచి మే 31 వరకు ఉంటుంది. జనరల్ టికెట్ రూ.14,500, ఏసీ(3ఏ) రూ.21,700, ఏసీ(2ఏ) రూ.27,900. రైలు సికింద్రాబాద్ నుంచి జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట మీదుగా వెళ్తుంది.
ప్యాకేజీ-4: యమునా నది పుష్కరాల సందర్భంగా పూరి, కోణార్క్, బైద్యనాథ్ ధామ్, వారణాసి, అయోధ్య, ప్రయాగరాజ్, కాశీ యాత్ర. ఈ యాత్ర జూన్ 3 నుంచి జూన్ 12 వరకు ఉంటుంది. టికెట్ ధరలు జనరల్ రూ.16,700, ఏసీ (3ఏ) రూ.26,100, ఏసీ (2ఏ) రూ.34,100గా నిర్ణయించారు.
ఫ్లైట్ ప్యాకేజీలు కూడా..
దేశీయ, అంతర్జాతీయ పర్యటనల కోసం కూడా ఐఆర్సీటీసీ ప్రత్యేక విమాన ప్యాకేజీలను ప్రకటించింది. హైదరాబాద్ నుంచి కశ్మీర్, కాశి, అయోధ్య, గుజరాత్, కర్నాటక, హరిద్వార్, రిషికేశ్, చార్ధామ్, లడఖ్, అండమాన్ వంటి ప్రాంతాలకు ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. వీటి ధరలు ఒక్కొక్కరికి రూ.35 వేల నుంచి రూ.74 వేల వరకు ఉన్నాయి. అలాగే నేపాల్, థాయ్లాండ్, శ్రీలంక, యూరోప్ ప్రాంతాలకు అంతర్జాతీయ ప్యాకేజీలు కూడా ఉన్నాయి. వాటి ధరలు రూ.55,700 నుంచి రూ.4,41,650 వరకు ఉన్నాయి. ప్రయాణికులకు టికెట్లోనే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, టీ, కాఫీ, స్నాక్స్, వాటర్ బాటిల్స్ అందిస్తామని ఐఆర్సీటీసీ అసిస్టెంట్ మేనేజర్ పీవీ వెంకటేశ్ తెలిపారు. ఒక్కో యాత్రలో 30 మంది టూరిస్టులను ఒక గ్రూపుగా ఏర్పాటు చేసి ఇద్దరు గైడ్లు, ఒక రైల్వే అధికారిని నియమిస్తారని చెప్పారు.
