భద్రతా కారణాలతో కాశ్మీర్లో జరగాల్సిన అండర్–16, 19 క్రికెట్ ట్రయల్స్ను రద్దు చేశారు. దీంతో జమ్మూకాశ్మీర్ జట్టుకు మోంటార్గా వ్యవహరిస్తున్న టీమిండియా ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్తో పాటు ట్రయల్స్కు వచ్చిన యువ ఆటగాళ్లందరూ ఆ రాష్ట్రాన్ని వీడి స్వస్థలాలకు బయలుదేరి వెళ్లారు. విజయ్ మర్చంట్ ట్రోఫీ (అండర్–16), కూచ్ బెహర్ (అండర్–19) జట్ల ట్రయల్స్ను పర్యవేక్షిస్తున్న ఇర్ఫాన్ శ్రీనగర్లో ఉంటున్నాడు. ‘సెకండ్ ఫేజ్ జూనియర్ ట్రయల్స్ పోస్ట్పోన్ అయ్యాయి. భద్రత విషయంపై రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ సీఈఓ బుఖారీ, అడ్మినిస్ట్రేటర్ జస్టిస్ ప్రసాద్తో చర్చించాను. ఆటగాళ్లకు భద్రత కల్పించడం కష్టమని వాళ్లు చెప్పారు. దీంతో క్రికెటర్లను సొంత ప్రదేశాలకు పంపించాలని సూచించారు. ఇప్పటికే కొంత మంది ప్లేయర్లు క్షేమంగా ఇళ్లకు చేరుకున్నారు. మిగతా వాళ్లను కూడా క్షేమంగా పంపేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం’ అని పఠాన్ పేర్కొన్నాడు.

