
ఒక వ్యూహకర్తగా నేను అనుమానాస్పద భావనలను, ఆలోచనలను వాస్తవాలుగా ప్రచారం చేయను. కానీ, ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల మధ్య జరుగుతున్న పరిణామాలని నిశితంగా గమనిస్తుంటాను. వాటిపై ఆసక్తి చూపుతుంటాను. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం, దానివల్ల ప్రపంచం ఎదుర్కోబోయే పరిణామాలను అంచనా వేసినప్పడు కలవరం మొదలవుతుంది. ఇటీవల ప్రపంచం లైవ్ విద్యుత్ వైర్ లాగ, ఉద్రిక్తంగా, భారీ షార్ట్ సర్క్యూట్కు దారి తీసే విధంగా ప్రమాదానికి దగ్గరగా ఉంది. తూర్పు ఐరోపా నుంచి ఇండో– -పసిఫిక్ వరకు, సైబర్స్పేస్ నుంచి ప్రపంచ రాజకీయాల వరకు పరిశీలిస్తే.. నేను ఇప్పుడు అడగడానికి ధైర్యం చేసే ప్రశ్నను ఒకవిధంగా తీవ్రంగానే పరిగణించాలి. ఆ ప్రశ్న ఏమిటంటే.. మూడో ప్రపంచ యుద్ధం నిజమయ్యే అవకాశం ఉందా?
ప్రపంచవ్యాప్తంగా మానవాళి పరిణామం చెందిందని, ప్రపంచ యుద్ధాలు బ్రేకింగ్ న్యూస్ కాదని అవి చరిత్ర పుస్తకాలకు చెందినవని మనం నమ్ముతున్నాం. అయినప్పటికీ, ప్రపంచ చరిత్ర మొదట మృదువుగా, ఆ తరువాత కాస్త బిగ్గరగా హెచ్చరికలను, సంకేతాలను పంపుతోంది. 1914లో ఒకే ఒక బుల్లెట్ ప్రపంచాన్ని అగ్నిగుండంలోకి నెట్టేసింది. ఆ ప్రమాదం నుంచి బయటపడిన తరువాత 1939లో మరోసారి ప్రపంచం నెత్తుటి నెగళ్లును చవిచూసింది. నేడు ఆ సంకేతాలు మళ్ళీ కనిపిస్తున్నాయి.
బలహీనమైన పొత్తులు, పెరుగుతున్న జాతీయవాదం, ఆర్థిక అస్థిరత, దౌత్యం పట్ల ఉదాసీన వైఖరి ఆందోళన కలిగిస్తున్నాయి. వాస్తవానికి యుద్ధాలు రాత్రికి రాత్రే చెలరేగవు. అవి ఉద్రిక్తతల నడుమ మరుగుతుంటాయి. జాతీయ అహంకారాలు, నెరవేరని ఆశయాలు, ప్రాదేశిక వివాదాలు, పరోక్షంగా రెచ్చగొట్టే చర్యలు తదితర కారణాలతో యుద్ధాలు మొదలవుతాయి. కానీ, ఏదో ఒక రోజు కోలుకోలేనంతగా భారీ నష్టాన్ని మిగిల్చి ముగుస్తుంటాయి. నా అభిప్రాయం ప్రకారం మనం ప్రమాదపు అంచున నడుస్తున్నాం. ప్రపంచంలోని చాలా భాగం ప్రమాదకర పరిస్థితుల్లో నిద్రిస్తోంది.
ప్రపంచ యుద్ధాల ప్రతిధ్వనులు
యూరప్ యుద్ధాన్ని కోరుకున్నందున మొదటి ప్రపంచ యుద్ధం మొదలవలేదు. కానీ, అది ప్రారంభమైన తర్వాత దానిని ఎలా ఆపాలో ఎవరికీ తెలియకపోవడంతో ప్రారంభమైంది. రాజకీయ హత్యలు, పొత్తుల పరంపర, అదుపులేని ఆయుధ పోటీ కాంటినెంట్ను స్మశానవాటికగా మార్చింది. ఇక రెండవ ప్రపంచ యుద్ధం ఫాసిజం పెరుగుదల, సామూహిక ప్రచారం, బలహీనమైన ప్రపంచ సంస్థలు, విస్తృత ఆర్థిక మాంద్యంతో ప్రారంభమైంది.
ప్రస్తుతం అవే పరిణామాలను నేడు మనం చూస్తున్నాం. మనం డిజిటల్గా చార్జ్ చేసిన, ఆర్థికంగా అనిశ్చితమైన, సైద్ధాంతికంగా విచ్ఛిన్నమైన యుగంలో జీవిస్తున్నాం. ఒకప్పుడు ప్రపంచ యుద్ధానికి దారితీసిన పరిస్థితులు భయంకరంగా తిరిగి వస్తున్నాయి. ఈసారి మాత్రం అణ్వాయుధాలు, సైబర్ వార్ఫేర్, కృత్రిమ మేధస్సు మిక్స్ అవుతున్నాయి. గ్లోబల్ ఫ్లాష్పాయింట్లు.. గన్ పౌడర్ దగ్గర నిప్పురవ్వల తరహాలో ఉన్నాయి వాటిని వ్యూహాత్మకంగా విచ్ఛిన్నం చేద్దాం.
తూర్పు యూరప్, రష్యా & నాటోరష్యా– ఉక్రెయిన్ యుద్ధం ఇప్పటికే ఆధునిక యుద్ధాన్ని తిరిగ రాసింది. ఉక్రెయిన్కు నాటో సైనిక మద్దతు, యుద్ధవాంఛతో రష్యా దూకుడు ఓపెన్ ఎండెండ్ వార్ జోన్ను సృష్టించింది. ఒక మిస్ ఫైర్, ఒక ఓవర్ రియాక్షన్.. ఇది ఖండాంతర ఘర్షణగా మారవచ్చు. ఇక్కడ ప్రతి నిర్ణయంపై అణ్వాయుధ నీడ నిరంతరం కమ్ముకుంటుంది.
ఇండో- పసిఫిక్, అమెరికా -చైనా శత్రుత్వం
తైవాన్ కేవలం ఒక భూభాగమే కాదు, అది ఒక వార్ ట్రిగ్గర్. చైనా దూకుడుగా వ్యవహరించడం, నావికాదళ విన్యాసాలు, ఎయిర్స్పేస్ ఉల్లంఘనలు పెరుగుతున్న అసహనాన్ని సూచిస్తున్నాయి. మరోవైపు వ్యూహాత్మక ప్రయోజనాలు, కమిట్మెంట్స్తో అమెరికా యుద్ధ నిరోధక క్రీడలు ఆడుతోంది. సముద్రంలో ఒక ప్రమాదం లేదా ఆకాశంలో తప్పుగా అర్థం చేసుకున్న అనుమానాస్పద కదలిక యుద్ధంగా మారడానికి కారణమయ్యే అవకాశం ఉంది.
దక్షిణ చైనా సముద్రం ఒక జియోపొలిటికల్ మైన్ఫీల్డ్గా మారింది. కాగా, ఇజ్రాయెల్, ఇరాన్ ఇరుదేశాలు ఒకదానిపై ఒకటి క్షిపణులతో దాడిచేస్తూ ప్రత్యక్ష యుద్ధం అంచున ఉన్నాయి. యుద్ధమేఘాలు, వైమానిక దాడులు, అణు హెచ్చరికలు ఇవన్నీ యుద్ధవాతావరణం తీవ్రతరమవుతున్నదని సూచిస్తున్నాయి. ఈ ప్రాంతంలోని ప్రాక్సీ వార్ ఎకోసిస్టమ్.. ప్రపంచ శక్తులను ఇష్టపూర్వకంగా లేదా ఇష్టం లేకుండానే యుద్ధంలోకిలాగే సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీనికి తోడు మిలిటెంట్ సంస్థలు, మతపరమైన ఫాల్ట్లైన్స్, చమురు రాజకీయాలు కలగలిసి అధిక- ఓల్టేజ్ విస్ఫోటనానికి ఊతమిస్తున్నాయి.
దౌత్యం పతనం
దౌత్యం బలంగా ఉండవలసిన సమయంలో, అది మరింత ఆందోళనకరంగా, బలహీనంగా మారింది. ప్రపంచ శాంతికి కృషి చేయాల్సిన ఐక్యరాజ్యసమితి నిస్తేజంగా మారింది. జీ7, జీ20 శిఖరాగ్ర సమావేశాలు, శాంతి ఒప్పందాల కంటే పత్రికా ప్రకటనల గురించి ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్నాయి. రాజనీతిజ్ఞులు, రాయబారుల స్థానాలను బలమైన వ్యక్తులు భర్తీ చేస్తున్నారు. అధ్వానమైన పరిస్థితి ఏమిటంటే.. శాంతి ఇప్పుడు అన్ఫ్యాషన్గా మారింది. దేశాలు ఇప్పుడు చర్చలను బలహీనతగా పరిగణిస్తున్నాయి.
ఆయుధీకరణ ప్రపంచవ్యాప్తంగా సాధారణంగా మారిపోయింది. ఇది స్థిరమైన దిశ కాదు. అయినప్పటికీ, మూడో ప్రపంచ యుద్ధం జరగకపోవచ్చు. మరోసారి ప్రపంచ యుద్ధాన్ని నిలువరించే నిరోధకాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా, చైనా వంటి దిగ్గజాల మధ్య పరస్పర ఆర్థిక సంబంధాలపై ఆధారపడటం వాటిమధ్య ఒక బంధంగా పనిచేస్తుంది. ప్రపంచం ఆధునిక శ్రేయస్సును రుచి చూసింది. ప్రపంచవ్యాప్తంగా చాలామంది పౌరులు యుద్ధాన్ని కోరుకోవడం లేదు. కానీ, ఇక్కడ స్ట్రాటజిస్ట్ హెచ్చరిక ఉంది, ఆశ అనేది ఒక వ్యూహం కాదు. పరస్పర హామీలు శాశ్వత హామీలు కావు. అవి వీగిపోయే అంచనాలు. ఆ అంచనాలు చెదిరిపోవడానికి 1914లో కొన్ని నెలలు, 1930లలో కొన్ని సంవత్సరాలు మాత్రమే పట్టింది.
యుద్ధానికి ముందు భారత్ పాత్ర
భారతదేశం ప్రస్తుతం వ్యూహాత్మక కూడలిలో ఉంది. ప్రపంచ ఆకాంక్షలతో పెరుగుతున్న శక్తిగా, మనం ప్రేక్షకుడిగా ఉండలేం. భారతదేశం శాంతి పరిరక్షణ, ఆర్థిక దౌత్యం, సైనిక సంసిద్ధత ద్వారా తన స్వరాన్ని నొక్కి చెప్పాలి. బ్రిక్స్, క్వాడ్, జీ20లలో మన స్థానాన్ని కేవలం వాటిపై ప్రభావం కోసం మాత్రమే కాకుండా, ప్రపంచ స్థిరత్వం కోసం కూడా ఉపయోగించుకోవాలి. ఈ విషయంలో భారతదేశం వ్యూహాత్మకంగా స్వయంప్రతిపత్తి కలిగి ఉండాలి. ఏ సూపర్ పవర్ పోటీలోనూ భారత్ పావుగా ఉండకూడదు.
విచ్ఛిన్నమైన ప్రపంచంలో, స్థిరీకరణ కేంద్రంగా ఉండటానికి భారత్కు విశ్వసనీయత ఉంది. కాగా, ఒక వ్యూహకర్తగా , ప్రపంచానికి తక్షణ పునఃసమీక్ష, ప్రాధాన్యతలు, సమర్థ నాయకత్వం అవసరమని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఈసారి ప్రపంచ యుద్ధం జరిగితే రెండో అవకాశాలను అందించదు. ఇది చాలా వేగంగా, అనుసంధానమై వినాశకరమైనదిగా ఉంటుంది. మనం పెరుగుతున్న తుపానును విస్మరిస్తూనే ఉంటే చరిత్ర మనల్ని క్షమించకపోవచ్చు. భవిష్యత్తులో మన మనుగడ కొనసాగకపోవచ్చు.
ఉత్తర కొరియా వైల్డ్ కార్డ్
అణు ఆశయాలు, బలహీనమైన ఆర్థిక వ్యవస్థ, రాజవంశపు అహంకారంతో కూడిన అస్థిరమైన పాలన ఎల్లప్పుడూ ప్రమాదకరం. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్-ఉన్ తరచుగా చేసే క్షిపణి పరీక్షలు, అణు బెదిరింపులు కేవలం బుకాయింపులు కాదు. అవి వ్యూహాత్మకంగా రెచ్చగొట్టే చర్యలు. ప్రస్తుతం ప్రపంచం నిప్పురవ్వలతో నిండి పోయింది. దురదృష్టవశాత్తు అది గన్ పౌడర్తో కూడా నిండి ఉంది.
కె. కృష్ణ సాగర్ రావు, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ సర్టిఫైడ్ స్ట్రాటజిస్ట్