ఇరాన్‌ను ఊహించని దెబ్బ కొట్టిన ఇజ్రాయెల్.. ఫస్ట్ టైం ఇరాన్ చమురు డిపోలపై అటాక్ !

ఇరాన్‌ను ఊహించని దెబ్బ కొట్టిన ఇజ్రాయెల్.. ఫస్ట్ టైం ఇరాన్ చమురు డిపోలపై అటాక్ !

టెహ్రాన్: యుద్ధంలో ఫస్ట్ టైం.. ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్ చమురు నిల్వలు ఉన్న డిపోలపై దాడులకు దిగాయి. మొత్తం మూడు చమురు డిపోలపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. దక్షిణ టెహ్రాన్ ప్రాంతంలో ఉన్న టోండ్‌గౌయాన్ ఆయిల్ రిఫైనరీపై ఇజ్రాయెల్ బాంబు దాడులు చేసింది. భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఆ ప్రాంతమంతా మంటలు, పొగలు వ్యాపించాయి. ఈ దాడులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.

ఇరాన్ కూడా టోండ్‌గౌయాన్ ఆయిల్ రిఫైనరీపై దాడి జరిగినట్లు ధృవీకరించింది. ఇరాన్ మిలటరీకి ఇక్కడ నుంచే చమురును సరఫరా చేస్తుందని, అలాంటి చముల నిల్వలను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ ప్రకటించుకుంది. ఇరాన్లోని చములు నిల్వలపై ఇజ్రాయెల్ చేసిన ఈ దాడులతో ఇరాన్ ఆర్థిక ప్రయోజనాలకు భారీ నష్టం జరిగింది.  ఇరాన్లో దాదాపు 209 బిలియన్ బారెల్స్ క్రూడ్ ఆయిల్ నిల్వలు ఉన్నాయి. అంటే.. ప్రపంచంలో ఉన్న మొత్తం చమురు నిల్వల్లో 12 శాతం ఇరాన్లోనే ఉండటం గమనార్హం.

ఇదిలా ఉండగా.. గత నెల 28 నుంచి మొదలైన యుద్ధం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు కూడా భారీగా పెరిగాయి. అమెరికా ముడి చమురు ధరలు ఒకే వారంలో 35.63 శాతం పెరగడం ఇదే మొదటిసారి. వెస్ట్ టెక్సస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యూటీఐ) ఫ్యూచర్స్ ధర బ్యారెల్ కు 90.90 డాలర్ల వద్ద ముగిసింది. బ్రెంట్ చమురు ధర కూడా దాదాపు 28 శాతం పెరిగి 92.69 డాలర్లకు చేరింది. 2020 ఏప్రిల్ తర్వాత ఒకే వారంలో ఇంతటి పెరుగుదల ఇదే తొలిసారి. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలపై ఒత్తిడి పెరుగుతోంది.

ఈ సంక్షోభం ఇలాగే కొనసాగితే రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరల మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. వాణిజ్య సిలిండర్ ధర పెరగడం వల్ల హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ రంగాల నిర్వహణ ఖర్చులు పెరుగుతాయి. దీనివల్ల అవి ధరలను పెంచే అవకాశాలు ఉంటాయి.