ఇస్రో టెక్నాలజీ..ఆర్మీ కోసం అదిరిపోయే ట్రాకర్‌

ఇస్రో టెక్నాలజీ..ఆర్మీ కోసం అదిరిపోయే ట్రాకర్‌

ఆర్మీ, సైనికుల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎట్లాంటి పరిస్థితుల్లోనైనా, ఏ టైంలోనైనా పని చేస్తూనే ఉంటారు. కొన్నిసార్లు శత్రువుల ప్రాంతాల్లోకి వెళ్తుంటారు. అక్కడే వాళ్లతో తలబడుతుంటారు. అట్లాంటి టైంలో వాళ్లకు సాయం అత్యవసరం. అందుకే వాళ్లకోసం ఓ ప్రత్యేకమైన ట్రాకర్‌ను కనుగొన్నారు. పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో దీన్ని రూపొందించారు. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ పరికరానికి కావాల్సిన టెక్నాలజీని ఇస్రో రెడీ చేసి భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌కు అందించింది. అయితే ఇది సాధారణ చిప్‌సెట్‌, రిసీవర్‌ టెక్నాలజీ కాదని, ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ రెస్ట్రిక్టెడ్‌ సర్వీస్‌లో భాగమని తెలిసింది. సుమారు18 నెలలు కష్టపడి తయారు చేసిన ఈ టెక్నాలజీపై ఇప్పటివరకు ఇస్రో ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ యాంటీ స్పూఫింగ్‌ టెక్నాలజీ.. నావిగేషన్‌ సేవలతో పాటు ట్రాకర్‌ను పెట్టుకున్న వ్యక్తి ఎక్కడున్నారో టైమ్‌ డివిజన్‌ మల్టిపుల్‌ యాక్సెస్‌తో తెలియజేస్తుందని సమాచారం. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌తో రెండు వైపులా రిపోర్టింగ్‌ చేసుకునేలా పరికరాన్ని రెడీ చేసేందుకు ఇస్రోతో ఒప్పందం కుదుర్చుకున్నామని బీఈఎల్‌ వెల్లడించింది. మనకు సంబంధించి నౌకలు ఎక్కడున్నాయో తెలుసుకోవడంతో పాటు వాటి నుంచి సమాచారం కూడా దీని ద్వారా పక్కాగా తెసుకోవచ్చని పేర్కొంది. ఇక ట్రాకర్‌తో వన్‌ వేలో, వ్యక్తి, నౌక ఎక్కడుందో సమాచారం తెలుసుకోవచ్చని వివరించింది.