- సీఎస్ రామకృష్ణారావుతో ఇస్టా ప్రతినిధి బృందం భేటీ
హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర విత్తన రంగానికి మరో అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన విత్తన ప్రమాణాలను నిర్దేశించే 'ఇంటర్నేషనల్ సీడ్ టెస్టింగ్ అసోసియేషన్' - (ఇస్టా) బోర్డ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాలు హైదరాబాద్ వేదికగా జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు ఇస్టా చరిత్రలోనే తొలిసారిగా భారత్ ఆతిథ్యం ఇస్తుండటం విశేషం.
ఈ సందర్భంగా గురువారం ఇస్టా ప్రతినిధుల బృందం సీఎస్ రామకృష్ణారావు, స్పెషల్ సీఎస్ జయేశ్ రంజన్లతో ప్రత్యేకంగా భేటీ అయింది. రాష్ట్రంలో విత్తన రంగ అభివృద్ధి, అంతర్జాతీయ ఎగుమతులు, నాణ్యతా ప్రమాణాల పెంపుతో పాటు తెలంగాణను ‘గ్లోబల్ సీడ్ హబ్’గా మార్చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై చర్చించారు.
ప్రస్తుతం ఇస్టా ప్రెసిడెంట్గా ఉన్న తెలంగాణకు చెందిన డాక్టర్ కె. కేశవులు అధ్యక్షతన ఈ భేటీలు జరుగుతున్నాయి. 2023లో అమెరికా, 2024లో అర్జెంటీనా, 2025లో ఫిలిప్పీన్స్ దేశాలు ఈ సమావేశాలకు ఆతిథ్యం ఇచ్చాయి. ఇప్పుడు ఆ అరుదైన అవకాశం హైదరాబాద్కు దక్కింది. ఈ భేటీల అనంతరం కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో 'సీడ్ హెల్త్ సెమినార్' జరగనుంది.
