- 400 మంది శరణార్థులున్న బడిపై దాడి
- నేలమట్టమైన బిల్డింగ్..
- వాళ్ల పరిస్థితి ఏంటో తెలియదన్న అధికారులు
- కొన్నేండ్లపాటు ఈ మారణకాండను మరలేమన్న జెలెన్స్కీ
లవీవ్: ఉక్రెయిన్ లో శరణార్థులు తలదాచుకున్న ఒక ఆర్ట్ స్కూల్పై రష్యా బాంబుల వర్షం కురిపించింది. పోర్ట్ సిటీ మేరియపోల్ ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా మిలిటరీ గత కొన్ని రోజులుగా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల ఉక్రెయిన్ సైన్యాన్నే కాకుండా జనావాసాలను కూడా టార్గెట్గా చేసుకుని దాడుల తీవ్రత పెంచింది. ఈ క్రమంలో శనివారం మేరియపోల్లోని ఒక ఆర్ట్ స్కూల్పై బాంబు దాడులకు తెగబడింది. ఆ స్కూల్లో సుమారు 400 మంది శరణార్థులు తలదాచుకున్నట్టు ఉక్రెయిన్ అధికారులు చెప్పారు. బాంబు దాడుల్లో స్కూల్ బిల్డింగ్ నేలమట్టమయ్యిందని, చాలా మంది శిథిలాల కింద చిక్కుకున్నారని తెలిపారు. అయితే ఈ దాడుల్లో ఎంత మంది మరణించారనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. గత బుధవారం కూడా పౌరులు తలదాచుకున్న ఓ థియేటర్పై రష్యా బలగాలు దాడులు చేసింది. మూడు వారాలుగా మరియుపోల్పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. ఉక్రెయిన్–రష్యా యుద్ధంలో మారణకాండకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది మరియుపోల్ సిటీ.. నగరాన్ని నలువైపుల నుంచి రష్యా సేనలు చుట్టుముట్టాయి. తిండి, నీళ్లు అందకుండా అడ్డుకోవడంతో పాటు, కరెంట్సరఫరాను నిలిపేశాయి. ఇప్పటి దాకారష్యా దాడుల్లో 2,300 మంది ఉక్రెయిన్ పౌరులు, సైనికులు చనిపోగా.. వేల మంది గాయపడ్డారు.
కింజాల్ మిస్సైల్స్ ప్రయోగించాం: రష్యా
ఉక్రెయిన్పై దాడులు పెంచినట్టుగా రష్యా మిలిట రీ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. సైనికులే టార్గెట్గా లాంగ్ రేంజ్ హైపర్సోనిక్, క్రూయిజ్ మిస్సైల్స్ను వాడుతున్నట్టు తెలిపాయి. ఉక్రెయిన్ పై మరో కింజాల్ మిసైల్ను ప్రయోగించినట్లు ఆదివారం ప్రకటించాయి. కోస్టియానివ్కా సిటీలోని ఆర్మీ ఫ్యూయెల్ స్టోరేజ్ కేంద్రాన్ని ధ్వంసం చేసినట్లు వెల్లడించాయి. శనివారం కింజాల్ మిస్సైల్ను తొలిసారి ప్రయోగించిన రష్యా.. ఆదివారం మరో మిసైల్ను ప్రయోగించింది. నిజిన్లోని ఆర్మర్ రిపెయిర్ ప్లాంట్ను కూడా ధ్వంసం చేసినట్టు రష్యా డిఫెన్స్ మినిస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. కాగా, మరియుపోల్ లోని యూరప్ లోనే అతిపెద్ద ఐరన్, స్టీల్ కంపెనీ అజోవ్ స్టాల్ ఫ్యాక్టరీనీ రష్యా పేల్చేసింది. ఈ దాడుల్లో ఫ్యాక్టరీ చాలా వరకు దెబ్బతింది. ఈ చర్యతో ఉక్రెయిన్కు ఆర్థికంగా చాలా నష్టం జరగనుంది.
ఇది టెర్రరిజమే.. యుద్ధ నేరంగానే చూస్తం: ఉక్రెయిన్ ప్రెసిడెంట్
రష్యా బాంబు దాడులను జెలెన్స్కీ తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘ప్రశాంతమైన నగరంలో కల్లోలం సృష్టిస్తున్నారు. అక్కడి జనం ఏం తప్పు చేశారు. ఇది నిజంగా టెర్రరిజమే. ఈ దారుణాలను ఉక్రెయిన్ కొన్నేండ్ల పాటు మరిచిపోదు. రష్యా బాలగాల విధ్వంసం చరిత్రలో యుద్ధ నేరాల కింద నిలిచిపోతుం ది” అని జెలెన్స్కీ చెప్పారు. మరోవైపు రష్యాతో సంబంధాలున్న రాజకీయ పార్టీలను జెలెన్స్కీ సస్పెండ్ చేశారు. మొత్తంగా 11 రాజకీయ పార్టీలపై వేటు వేసినట్టు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఒక మార్షల్లాను అమలులోకి తీసుకొస్తు న్నట్టు జెలెన్స్కీ ప్రకటించారు. ఉక్రెయిన్ పార్లమెంట్లో 44 సీట్లు ఉన్న ప్లాట్ఫామ్ ఫర్ లైఫ్ పార్టీ వీటిలో అతి పెద్దది. ఆ పార్టీ లీడర్ విక్టర్ మెద్వెద్చుక్ కు రష్యా ప్రెసిడెంట్ పుతిన్తో దగ్గరి సంబంధాలు ఉన్నాయి. యువ్హేని మురయేవ్ ఆధ్వర్యంలోని నాషీ పార్టీ కూడా ఈ లిస్టులో ఉంది. మురయేవ్ను ఉక్రెయిన్ ప్రెసిడెంట్గా చేయాలని రష్యా భావిస్తోంది.