ఇది టెర్రరిజమే.. యుద్ధ నేరంగానే చూస్తం

ఇది టెర్రరిజమే.. యుద్ధ నేరంగానే చూస్తం
  • 400 మంది శరణార్థులున్న బడిపై దాడి
  • నేలమట్టమైన బిల్డింగ్.. 
  • వాళ్ల పరిస్థితి ఏంటో తెలియదన్న అధికారులు
  • కొన్నేండ్లపాటు ఈ మారణకాండను మరలేమన్న జెలెన్​స్కీ

లవీవ్: ఉక్రెయిన్​ లో శరణార్థులు తలదాచుకున్న ఒక ఆర్ట్​ స్కూల్​పై రష్యా బాంబుల వర్షం కురిపించింది. పోర్ట్ సిటీ మేరియపోల్​ ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా మిలిటరీ గత కొన్ని రోజులుగా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల ఉక్రెయిన్​ సైన్యాన్నే కాకుండా జనావాసాలను కూడా టార్గెట్​గా చేసుకుని దాడుల తీవ్రత పెంచింది. ఈ క్రమంలో శనివారం మేరియపోల్​లోని ఒక ఆర్ట్ స్కూల్​పై బాంబు దాడులకు తెగబడింది. ఆ స్కూల్​లో సుమారు 400 మంది శరణార్థులు తలదాచుకున్నట్టు ఉక్రెయిన్​ అధికారులు చెప్పారు. బాంబు దాడుల్లో స్కూల్​ బిల్డింగ్​ నేలమట్టమయ్యిందని, చాలా మంది శిథిలాల కింద చిక్కుకున్నారని తెలిపారు. అయితే ఈ దాడుల్లో ఎంత మంది మరణించారనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. గత బుధవారం కూడా పౌరులు తలదాచుకున్న ఓ థియేటర్​పై రష్యా బలగాలు దాడులు చేసింది. మూడు వారాలుగా మరియుపోల్​పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. ఉక్రెయిన్–రష్యా యుద్ధంలో మారణకాండకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది మరియుపోల్​ సిటీ.. నగరాన్ని నలువైపుల నుంచి రష్యా సేనలు చుట్టుముట్టాయి. తిండి, నీళ్లు అందకుండా అడ్డుకోవడంతో పాటు, కరెంట్​సరఫరాను నిలిపేశాయి. ఇప్పటి దాకారష్యా దాడుల్లో 2,300 మంది ఉక్రెయిన్​ పౌరులు, సైనికులు చనిపోగా.. వేల మంది గాయపడ్డారు. 

కింజాల్​ మిస్సైల్స్​ ప్రయోగించాం: రష్యా
ఉక్రెయిన్​పై దాడులు పెంచినట్టుగా రష్యా మిలిట రీ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. సైనికులే టార్గెట్​గా లాంగ్​ రేంజ్​ హైపర్​సోనిక్, క్రూయిజ్​ మిస్సైల్స్​ను వాడుతున్నట్టు తెలిపాయి. ఉక్రెయిన్ పై మరో కింజాల్ మిసైల్​ను ప్రయోగించినట్లు ఆదివారం ప్రకటించాయి. కోస్టియానివ్కా సిటీలోని ఆర్మీ ఫ్యూయెల్ స్టోరేజ్ కేంద్రాన్ని ధ్వంసం చేసినట్లు వెల్లడించాయి. శనివారం కింజాల్​ మిస్సైల్​ను తొలిసారి ప్రయోగించిన రష్యా.. ఆదివారం మరో మిసైల్​ను  ప్రయోగించింది. నిజిన్​లోని ఆర్మర్​ రిపెయిర్​ ప్లాంట్​ను కూడా ధ్వంసం చేసినట్టు రష్యా డిఫెన్స్​ మినిస్ట్రీ వర్గాలు​ వెల్లడించాయి. కాగా, మరియుపోల్ లోని యూరప్ లోనే అతిపెద్ద ఐరన్, స్టీల్ కంపెనీ అజోవ్ స్టాల్ ఫ్యాక్టరీనీ రష్యా పేల్చేసింది. ఈ దాడుల్లో ఫ్యాక్టరీ చాలా వరకు దెబ్బతింది. ఈ చర్యతో ఉక్రెయిన్​కు ఆర్థికంగా చాలా నష్టం జరగనుంది.

ఇది టెర్రరిజమే.. యుద్ధ నేరంగానే చూస్తం: ఉక్రెయిన్​ ప్రెసిడెంట్​
రష్యా బాంబు దాడులను జెలెన్​స్కీ తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘ప్రశాంతమైన నగరంలో కల్లోలం సృష్టిస్తున్నారు. అక్కడి జనం ఏం తప్పు చేశారు. ఇది నిజంగా టెర్రరిజమే. ఈ దారుణాలను ఉక్రెయిన్ ​ కొన్నేండ్ల పాటు మరిచిపోదు. రష్యా బాలగాల విధ్వంసం చరిత్రలో యుద్ధ నేరాల కింద నిలిచిపోతుం ది” అని జెలెన్​స్కీ చెప్పారు. మరోవైపు రష్యాతో సంబంధాలున్న రాజకీయ పార్టీలను జెలెన్​స్కీ సస్పెండ్​ చేశారు. మొత్తంగా 11 రాజకీయ పార్టీలపై వేటు వేసినట్టు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఒక మార్షల్​లాను అమలులోకి తీసుకొస్తు న్నట్టు జెలెన్​స్కీ ప్రకటించారు. ఉక్రెయిన్​ పార్లమెంట్లో 44 సీట్లు ఉన్న ప్లాట్​ఫామ్​ ఫర్​ లైఫ్​ పార్టీ వీటిలో అతి పెద్దది. ఆ పార్టీ లీడర్​ విక్టర్ మెద్వెద్చుక్​ కు రష్యా ప్రెసిడెంట్ ​పుతిన్​తో దగ్గరి సంబంధాలు ఉన్నాయి. యువ్​హేని మురయేవ్​ ఆధ్వర్యంలోని నాషీ పార్టీ కూడా ఈ లిస్టులో ఉంది. మురయేవ్​ను ఉక్రెయిన్​ ప్రెసిడెంట్​గా చేయాలని రష్యా భావిస్తోంది.