
Cognizant: ఏపీలో కూటమి ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి తాము స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వైపు మళ్లినట్లు వెల్లడించింది. దీనికింద రాష్ట్రంలో పెట్టుబడులను ఆహ్వానించేందుకు, కొత్త ఉపాధి అవకాశాల కల్పనకు అవసరమైన మౌలికసదుపాయాలు, అనుమతులను ఏపీ సర్కార్ వేగంగా జారీ చేస్తోంది. ఈ క్రమంలోనే ఆర్థిక రాజధానిగా ఉన్న విశాఖలో ఐటీ రంగాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు చేపడుతోంది.
కొన్ని నెలల కిందట విశాఖలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ ఏర్పాటుకు అవసరమైన భూములను రూపాయికే ఏపీ సర్కార్ కేటాయించటం సర్వత్రా చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇదే తరహా ఆఫర్ మరో టెక్ దిగ్గజం అయిన కాగ్నిజెంట్ కి కూడా ఇచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో కాగ్నిజెంట్ టెక్నాలజీస్ సంస్థ విశాఖలో రూ.వెయ్యి 582 కోట్లు వెచ్చించి ఐటీ క్యాంపస్ ఏర్పాటుకు సిద్ధమైందని సమాచారం. ఈ పెట్టుబడి ద్వారా రానున్న 8 ఏళ్లలో కొత్తగా 8వేల ఉద్యోగాల కల్పన సాధ్యం అవుతుందని వెల్లడైంది.
ఏపీ ప్రభుత్వం కాగ్నిజెంట్ సంస్థకు కాపులప్పాడు సమీపంలో 21.31 ఎకరాల భూమిని కేటాయించనున్నట్లు వెల్లడైంది. దీంతో విశాఖను ఏపీలో కొత్త ఐటీ హబ్ గా మార్చేందుకు చంద్రబాబు సర్కార్ ప్రయత్నిస్తోందని తెలుస్తోంది. విశాఖ నుంచి సేవలను అధికారికంగా కాగ్నిజెంట్ మార్చి 2029 నాటికి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడైంది. అయితే ఈ డీల్ గురించి మంత్రి నారా లోకేష్ ఈ ఏడాది జనవరిలో తన ప్రసంగాల్లో హింట్ ఇచ్చిన తర్వాత ప్రస్తుత చర్యలు కొనసాగుతున్నాయి. కొన్ని నెలల కిందట దావోస్ పర్యటన సమయంలో మంత్రి లోకేష్ కాగ్నిజెంట్ సీఈవో రవి కుమార్ ని కలిగి విశాఖలో క్యాంపస్ ఏర్పాటుకు ఆహ్వానించిన సంగతి తెలిసిందే.