కల్కి భగవాన్ ఆశ్రమంలో ఐటీ దాడులు

కల్కి భగవాన్ ఆశ్రమంలో ఐటీ దాడులు

చిత్తూరు జిల్లా వరదయ్యపాళెంలోని కల్కి ఆశ్రమంలో ఐటి దాడులు జరుగుతున్నాయి. జీసీ1, జీసీ 2, ఏకం(EKAM) టెంపుల్ లలో అధికారులు సోదాలు జరుపుతున్నారు. సంస్థ సీఈఓ లోకేష్ దాసాజి మరియు క్యాంపస్ లోని సిబ్బందిని, నాలుగు బృందాల ఐటి అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇ తమిళనాడు నేమం కల్కి ఆశ్రమం పై కూడా ఐటీ అధికారుల బృందం బుధవారం ఉదయం దాడులు జరిపి తనిఖీలు నిర్వహిస్తున్నారు. కల్కి అనుబంధ సంస్థలు మరో ముప్పై చోట్ల కూడా ఐటీ అధికారులు దాడులు జరిపి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

కల్కి ఆశ్రమ నిర్వాహకులు ఆధ్యాత్మిక పరంగా వివిధ సేవలకు గాను భక్తుల నుంచి సేకరిస్తున్న విరాళాల సొమ్మును భూముల కొనుగోలు, డిపాజిట్ల వంటివాటిపై దుర్వినియోగం అవుతున్నట్టు తమిళనాడు ఐటీ అధికారులకు ఫిర్యాదు అందినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే తమిళ నాడు ఐటీ అధికారుల బృందం కల్కి భగవాన్ ఆశ్రమాలపై దాడులకు పూనుకున్నట్లు తెలిసింది. ముఖ్యంగా వరదయ్యపాలెం కల్కి ఆశ్రమంపై బుధవారం ఉదయం నాలుగు ఐటీ ప్రత్యేక బృందాలు దాడులకు పాల్పడడంతో కల్కి నిర్వాహకులు అవాక్కయ్యారు. దీంతో బుచ్చినాయుడు కండ్రిగ, వరదయ్యపాలెం, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట, తడ మండలాల్లో కల్కి భూ వ్యవహారానికి సంబంధించిన బినామీ తంతు వంటివాటిపై కలకలం రేగింది. ఐటీ అధికారుల తనిఖీలు సాయంత్రం వరకు కొనసాగే అవకాశాలు ఉంది.

దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీనిపై డేగ కన్నేసింది. తమిళనాడు ఐటీ అధికారులు రంగప్రవేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తదుపరి ఎటువంటి చర్యలతో ముందుకు వెళ్లాలో సమాలోచనలో పడింది.సంస్థ వ్యవస్థాపకుడు కృష్ణాజి, సతీమణి ప్రితాజీ లోకేష్ దాసాజిలను తమిళనాడు రాష్ట్ర ఐటీ అధికారులు అదుపులోకి తీసుకుని వివరాలు సేకరిస్తున్నారు. తమిళనాడు, ఏపీలోని మొత్తం 40 ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి.