కుప్ప కూలుతున్న ఐటీ షేర్లు

కుప్ప కూలుతున్న ఐటీ షేర్లు
  •     ఒక్క నెలలోనే ఇన్వెస్టర్లకు 6.4 లక్షల కోట్ల లాస్‌‌   

హైదరాబాద్‌‌, వెలుగు: ఏఐ దెబ్బకు ఇండియన్‌‌ ఐటీ సెక్టార్​ అతలాకుతలం అవుతున్నది.  ఆంత్రోపిక్‌‌ ఏఐ కంపెనీ రోజుకో ప్రకటన చేస్తుండడంతో విప్రో, టీసీఎస్‌‌, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్‌‌లాంటి కంపెనీల షేర్లు కుప్పకూలుతున్నాయి. సాఫ్ట్‌‌వేర్ డెవలప్ చేయడం, యాప్‌‌లను మెయింటెయిన్‌‌ చేయడం, టెస్టింగ్‌‌, మైగ్రేషన్‌‌లాంటి  వాటిపై  అవర్స్ బట్టి లేదా ఫిక్స్డ్‌‌ ఇన్‌‌కమ్‌‌ తీసుకునే ఈ కంపెనీలకు ఏఐ టూల్స్‌‌ పెద్ద విలన్‌‌లా మారాయి. 

ఆంత్రోపిక్  అప్లికేషన్ సర్వీసెస్‌‌ను ఆటోమేట్‌‌ చేసేందుకు ప్లగిన్స్‌‌, కొత్త టూల్స్ తీసుకురావడంతో ఐటీ షేర్లు భారీగా పడ్డాయి.  వీటి రెవెన్యూ రాబోయే మూడేండ్లలో 10 శాతం మేర పడిపోతుందని అంచనా. దీనికితోడు  క్లయింట్ల ఐటీ ఖర్చులు తగ్గడం, మార్జిన్ ఒత్తిళ్లతో ఐటీ షేర్లు కోలుకోవడం కష్టంగా మారింది. 

10 కంపెనీలతో కూడిన నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఈ నెలలో ఏకంగా 21 శాతం క్రాష్ అయింది. 2003 తర్వాత ఒక నెలలో ఇంతలా పడడం ఇదే మొదటిసారి. ఐటీ సెక్టార్  దాదాపు 6.4 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌‌ కోల్పోయింది.  నిఫ్టీ ఐటీ షేర్లు గత నెల రోజుల్లో 16.8 శాతం నుంచి 27 శాతం వరకు పతనమయ్యాయి.  అప్లికేషన్‌‌ సర్వీసెస్‌‌పై ఎక్కువగా ఆధారపడే విప్రో షేర్లు 24 శాతం తగ్గగా, కోఫోర్జ్‌‌ షేర్లు 27 శాతం పడ్డాయి. టీసీఎస్‌‌, ఇన్ఫోసిస్‌‌ ఇన్వెస్టర్లు రూ.1.8 లక్షల కోట్ల చొప్పున నష్టపోయారు.  

రెవెన్యూ రిస్క్ ఎక్కువే!

నాస్కామ్‌‌ రిపోర్ట్ ప్రకారం.. ఇండియా ఐటీ సెక్టార్ రెవెన్యూ 2024–25 లో 297 బిలియన్ డాలర్లుగా ఉంది. అప్లికేషన్ సర్వీసెస్  (ఏడీఎం) నుంచి  40శాతం–70 శాతం వరకు రెవెన్యూ వస్తున్నది.  ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌‌మెంట్ సర్వీసెస్ (ఐఎంఎస్‌‌) వాటా 15 శాతం–25 శాతం వరకు ఉంది.  సర్వర్స్, క్లౌడ్ మేనేజ్‌‌మెంట్ ఈ కేటగిరీ కిందకు వస్తాయి.  కస్టమర్ సపోర్ట్, ఫైనాన్స్ అండ్  అకౌంటింగ్ చూసుకునే బిజినెస్ ప్రాసెస్ సర్వీసెస్ (బీపీఎస్‌‌ లేదా బీపీఓ ) 10 శాతం–-20 శాతం వాటా కలిగి ఉంది.  ఏడీఎం, ఐఎంఎస్‌‌, బీపీఎస్‌‌ నుంచి వచ్చే  రెవెన్యూ ఏఐ వలన తగ్గుతుందని అంచనా. 

ఈ సెగ్మెంట్లలో ఎక్కువ మంది ఉద్యోగులు పని చేసి  దానికి తగ్గట్టు అవర్స్ లెక్క బిల్ వేస్తారు.  గిట్‌‌హబ్‌‌ కోపైలెట్‌‌, ఆంత్రోపిక్  క్లోడ్‌‌, కర్సర్‌‌‌‌లాంటి  ఏఐ టూల్స్ కోడ్ రాయడం, బగ్స్ ఫిక్స్ చేయడం, టెస్టింగ్‌‌లాంటి ఆటోమేట్ చేస్తున్నాయి.  దీంతో ఈ బిల్ అవర్స్ తగ్గిపోతాయి. కంపెనీల రెవెన్యూ పడిపోనున్నది.

టాప్ ఐటీ కంపెనీల షేర్లు..

కంపెనీ                        నెల రోజుల్లో పతనం (శాతాల్లో)
కోఫోర్జ్‌‌                                  27  
టీసీఎస్‌‌                              20
ఇన్ఫోసిస్‌‌                           21
విప్రో                                   24
హెచ్‌‌సీఎల్‌‌ టెక్‌‌                19 
టెక్ మహీంద్రా                  16
ఎల్‌‌టీఐమైండ్‌‌ట్రీ              20