- కాంగ్రెస్ కు జై కొట్టిన బోడుప్పల్ ఆటో, పెయింటర్ కార్మికులు
మేడిపల్లి, వెలుగు: కార్మిక శాఖ మంత్రిగా ఉండి మంత్రి మల్లారెడ్డి కార్మికులకు ఒరగబెట్టింది ఏమీ లేదని అసంఘటిత కార్మికులకు అన్ని రకాలుగా హక్కులు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ అభ్యర్థి తోటకూర వజ్రేశ్ యాదవ్ అన్నారు. శనివారం బోడుప్పల్ కార్పొరేషన్ కు చెందిన సుమారు వెయ్యి మంది ఆటో కార్మికులు, పెయింటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వజ్రేశ్ యాదవ్ మాట్లాడుతూ.. నేడు దేశంలో, రాష్ట్రంలో కార్మికులకు ఎలాంటి రక్షణ లేకుండా పోయిందని పని భద్రత లేదని వాపోయారు. ఎక్కడ పని చేసిన తమ జీవితాలకు భరోసా లేకుండా పోయిందని వాపోయారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కార్మికుల కష్టాలు తీర్చేలా కృషి చేస్తామని చెప్పారు. ఆటో కార్మికులు మాట్లాడుతూ.. తమపై జీఎస్టీ పేరుతో శ్రమను దోచుకుంటున్నారని పర్మిట్ల పేరుతో తమకు వేధింపులే మిగులుతున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ బోడుప్పల్ అధ్యక్షుడు పోగుల నరసింహ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రాసాల వెంకటేష్ యాదవ్, బొమ్మకు కళ్యాణ్, దానగళ్ల యాదగిరి, ట్రెడ్ యూనియన్ నాయకులు మల్లేష్,నత్తి మైసయ్య, ఎస్సీ సెల్ అధ్యక్షుడు కందుకూరి నవీన్, కార్యకర్తలు పాల్గొన్నారు.