ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీ ఐటీసీ ఈ ఏడాది మార్చితో ముగిసిన క్వార్టర్లో రూ.3,482 కోట్ల లాభం ఆర్జించింది. 2017–18 ఆర్థిక సంవత్సరం లాభం రూ.2,932 కోట్లతో పోలిస్తే ఇది 18.72 శాతం అధికం. ఇదే కాలంలో మొత్తం ఆదాయం రూ.10,586 కోట్ల నుంచి రూ.12,206 కోట్లకు పెరిగింది. ఇబిటా రూ.4,144 కోట్ల నుంచి రూ.4,572 కోట్లకు ఎగిసింది. తాజా క్వార్టర్లో సిగరెట్లు సహా అన్ని ఎఫ్ఎంసీజీల వ్యాపారం నుంచి రూ.8,759 కోట్ల ఆదాయం వచ్చింది. గత క్యూ4లో ఇది రూ.7,988 కోట్లుగా నమోదయింది. ఈ క్వార్టర్లో సిగరెట్ల అమ్మకం నుంచి రూ.5,485 కోట్లు సమకూరాయి. 2017–18 ఆర్థిక సంవత్సరం క్యూ4లో ఇది రూ.4,936 కోట్లుగా నమోదయింది. సిగరెట్ ఇబిటా (పన్నుకు ముందున్న ఆదాయం) రూ.3,856 కోట్లు కాగా, మార్జిన్ 70.3 శాతం ఉంది. అగ్రి బిజినెస్ ఆదాయం 16.2 శాతం పెరిగి రూ.2,101 కోట్లకు చేరింది. గత క్యూ4లో ఇది రూ.1,808 కోట్లు. ప్రతి షేరుకు రూ.5.75 చొప్పున డివిడెండ్ చెల్లించాలని కూడా ఐటీసీ బోర్డు సిఫార్సు చేసింది. ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు రూ.1.75 పెరిగి రూ.300లకు చేరింది.
ఐటీసీ సీఎండీగా సంజీవ్ పురి…
ఐటీసీ గ్రూపు కొత్త చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా సంజీవ్పురిని నియమించినట్టు కంపెనీ సోమవారం ప్రకటించింది. ఆయన నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని స్టాక్ ఎక్స్చేంజీలకు తెలిపింది. పురి ప్రస్తుతం మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఐటీసీ గ్రూపు చైర్మన్, ప్రఖ్యాత వ్యాపారవేత్త వైసీ దేవేశ్వర్ అనారోగ్యం కారణంగా శనివారం మరణించడం తెలిసిందే. 2017లో ఆయన ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవి నుంచి వైదొలిగినా, నాన్–ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా మాత్రం పనిచేశారు.