ఆదివాసీల కోసమే.. కోయ భాష నేర్చుకున్నాను .. ‘వెలుగు’తో ఐటీడీఏ పీవో బి.రాహుల్

ఆదివాసీల కోసమే.. కోయ భాష నేర్చుకున్నాను .. ‘వెలుగు’తో ఐటీడీఏ పీవో బి.రాహుల్
  • వాళ్ల భాషల్లోనే మాట్లాడి వారి సమస్యల పరిష్కారానికి కృషి 
  • గిరిజన సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నాం.. 
  • విద్య, వైద్యానికి ఫస్ట్​ ప్రయారిటీ 
  • ప్రతీ పథకం ఆదివాసీలకు చేరాలి

భద్రాచలం, వెలుగు :  ఆదివాసీలతో మమేకమయ్యేందుకు కోయ భాష నేర్చుకున్నానని ఐటీడీఏ పీవో బి.రాహుల్​ తెలిపారు. వారితో వారి భాషలోనే డిస్కర్షన్​ చేస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానన్నారు. గిరిజన సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నానని తెలిపారు. విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ద్వారా వచ్చే సంక్షేమ పథకం మారుమూల ఆదివాసీకి చేరాలనేదే తన ధ్యేయమన్నారు. గతేడాది జూన్​ 25న భద్రాచలం ఐటీడీఏ పీవోగా బాధ్యతలు చేపట్టిన బి.రాహుల్ ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా సాధించిన విజయాలు, రాబోయే కాలంలో తన లక్ష్యాలను మంగళవారం ఆయన ‘వెలుగు’తో పంచుకున్నారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..

వారికి చేరువైతేనే...!

అభం శుభం తెలియని ఆదివాసీలు. తమ సమస్యలను చెప్పుకోవాలంటే భాష అడ్డు వస్తుంది. ఇలాంటి సమయంలో వారి భాషను నేర్చుకుని వారితో మాట్లాడితే సమస్యకు పరిష్కారం దొరికినట్లేనని భావించాను. అందుకే కష్టపడి కోయభాషను నేర్చుకున్నాను. పర్యటనలకు వెళ్లినప్పుడు వారితో మాట్లాడటం, స్కూళ్లలో కూడా పిల్లలతో సంభాషించడంతో స్వయంగా వారి కష్టాలను వివరించేవారు. అందుకనుగుణంగా వారి అవసరాలు తెలిసి నిధులు వెచ్చించాం. భాష వారికి నన్ను చేరువ చేసింది. 

వారి సంస్కృతి,సంప్రదాయాలను పరిరక్షించడం, ఆచార, వ్యవహారాలను కాపాడటం కోసం ట్రైబల్​ మ్యూజియంను డెవలప్​ చేశాం. వారి వంటలు, వారి ఆభరణాలు, వినియోగించిన వస్తువులు నేటితరాన్ని విశేషంగా ఆకర్షిస్తున్నాయి. టూరిస్టులు ఆసక్తిగా ట్రైబల్​ మ్యూజియంను తిలకిస్తున్నారు. కేంద్ర గిరిజన సంక్షేమశాఖను కూడా మెప్పించింది. కోటి రూపాయను మంజూరు చేశారు. ఇంకా డెవలప్​ చేస్తాం.

విద్యే అనేక రుగ్మతలకు మందు!

సమాజంలో నెలకొన్న అనేక రుగ్మతలకు విద్యే మందు. ప్రాథమిక దశలోనే సరైన పునాది పడితే గిరిబిడ్డల చదువు చక్కగా సాగుతుందని విశ్వసించాను. ఉద్దీపకం వర్క్ బుక్కులను తయారు చేయించాం.  లెక్కలు, ఇంగ్లిష్, ఇతర సబ్జెక్టులలో నిష్ణాతులైన టీచర్లతో వర్కు బుక్కులు తయారు చేయించి ట్రైనింగ్​ఇచ్చాం. వేదిక్ మ్యాథ్స్, ఇంగ్లిష్​ల్లో నైపుణ్యాలను గిరిబిడ్డలు సాధించారు. టెన్త్ పిల్లలకు కూడా స్కూళ్లు తెరిచిన నాటి నుంచి ఎగ్జామ్స్ పూర్తయ్యేంత వరకు స్పెషల్ మెనూ, గ్రాఫ్, మ్యాప్​ పాయింటింగ్, నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు, మెటల్ స్కేళ్లు, ఎగ్జామ్ ప్యాడ్స్, జామెట్రీ బాక్సులు ఇలా అన్నీ సదుపాయాలు కల్పించడం వల్ల  26 స్కూళ్లలో 100 శాతం రిజల్ట్ సాధించాం. 

ప్రతీ విద్యాసంస్థకు రూ.40వేల చొప్పున కేటాయించి రూ.6.22లక్షలతో మౌలిక సదుపాయాలు కల్పించాం. క్రీడల్లో కూడా గిరిపుత్రులు రాణించేలా రూ.25లక్షలతో క్రీడాపరికరాలు కొనుగోలు చేశాం. పీఈటీలతో ట్రైనింగ్​ ఇప్పించి ఉట్నూర్​లో ట్రైబల్ స్పోర్ట్స్ కు పంపించాం. ఓవరాల్​ ఛాంపియన్​ షిప్​ సాధించి ట్రోఫీ తీసుకొచ్చారు. టెన్త్ పూర్తయ్యాక ఏం చేయాలి? అనే విషయంలో కెరీర్​ గైడెన్స్ ద్వారా స్టూడెంట్లకు అవగాహన కల్పించాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం సంతోషాన్ని ఇచ్చింది. ఐఐటీ, ఎన్​ఐటీ, ఎంబీబీఎస్​ వంటి ఉన్నత విద్యలో గిరిజన పిల్లలు సెలక్ట్ అయ్యారు. మంచిగా చదివే స్టూడెంట్లకు ఐటీడీఏ ద్వారా ల్యాప్​ట్యాప్​లు, ఆర్ధిక సాయం అందిస్తూ ప్రోత్సాహం కల్పిస్తున్నాం. 

కొండరెడ్లకు 274 ఇళ్లు

ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కొండరెడ్లకు కూడా ప్రాధాన్యం ఇచ్చాం. ఐదు నియోజకవర్గాల్లో పీటీజీలకు 274 ఇళ్లు కేటాయించాం. ప్రకృతి వైపరీత్యాలు, అత్యవసర వైద్యం కోసం ట్రైబల్​ రిలీఫ్​ ఫండ్​ను రూ.6.20లక్షలు అందించాం. బోరులు, 11 కేవీ ట్రాన్స్ ఫార్మర్లు కొండరెడ్ల గ్రామాల్లో ఏర్పాటు చేశాం. గోగులపూడి కొండరెడ్ల ఆదివాసీలకు రూ.49లక్షలతో వెదురుతో హస్తకళల ట్రైనింగ్​, అగరబత్తి, సాంబ్రాణి కడ్డీల తయారీ, తేనెటీగల పెంపకంలోతర్ఫీదు ఇప్పించాం. అరుదైన కొండరెడ్ల తెగల కోసం ప్రత్యేక నిధులు కేటాయించాం.

ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ

వానాకాలంతో పాటు అన్నీ సీజనల్​వ్యాధుల బారిన పడకుండా ఆదివాసీల ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తున్నాం. నిత్యం పీహెచ్​సీల తనిఖీలతో పాటు వారి నుంచి తెలుసుకున్న సమస్యల పరిష్కారం కోసం నిధులు కేటాయిస్తున్నాం. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి చేయూత ఇస్తున్నాం. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, మందుల నిల్వలు, వ్యాక్సినేషన్​, సిబ్బంది కొరత లేకుండా సర్దుబాటు చేస్తున్నాం. 

ఉపాధికి చేయూత

చదువు పూర్తి చేసిన గిరిజన యువతకు ఉపాధి కల్పించే బాధ్యత కూడా ఐటీడీఏనే తీసుకునేలా యాక్షన్​ ప్లాన్​ రూపొందించి అమలు చేశాం. ఐటీడీఏలోనే వారికి ట్రైనింగ్​, కోచింగ్​ క్యాంపులు ఏర్పాటు చేయడంతో పలువురు గిరిజన యువకులు పోలీసు, ఆర్మీలో ఉద్యోగాలు సాధించారు. భద్రాచలంలోని గ్రంథాలయంలో రూ.25లక్షలతో డిజిటల్​లైబ్రరీని నిర్మించాం. గిరిజనులతో పాటు ప్రతీ నిరుద్యోగి ట్రైన్​ అయ్యేలా పుస్తకాలను అందించాం. గిరిజన మహిళల ఆర్థిక ప్రగతికి కూడా అండదండగా నిలిచాం. 

వారు ఏర్పాటు చేసుకున్న చిన్న పరిశ్రమలు కుంటుపడితే రూ.20లక్షల చొప్పున ఆర్థిక సాయం ఇచ్చి తిరిగి నిలబెట్టాం. వారిలో మార్కెటింగ్ స్కిల్స్ పెంపొందించేలా ట్రైనింగ్​ సెంటర్లు ఏర్పాటు చేసి తర్ఫీదు ఇచ్చి యూనిట్లు నడుపుకునే వెసలుబాటు కల్పించాం. గిరిజన మహిళలకే పీసా చట్టం ప్రకారం ఏజెన్సీలో ఇసుక రీచ్​లను అప్పగిస్తూ కూడా ఇటీవల నిర్ణయం తీసుకున్నాం.