శ్రీనగర్: ప్రమాదవశాత్తు ప్రైవేట్ బస్సు లోయలో పడి ఆరుగురు మృతిచెందిన సంఘటన జమ్మూకశ్మీర్ లోని రజౌరీ జిల్లాలో జరిగింది. దరాల్ ప్రాంతంలోని ఉజ్జాన్-దండ్కోట్ దగ్గర ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రయివేటు బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అర్థరాత్రి 12.30గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే స్థానికులు స్పందించి పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డవారిని స్థానిక హస్పిటల్ కి తరలించారు. గాయపడ్డ వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం జమ్మూలోని హస్పిటల్ కి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
