- మా పార్టీది 130 ఏండ్ల చరిత్ర: పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
హైదరాబాద్, వెలుగు : కూల్చే ప్రయత్నం చేస్తే కూలడానికి కాంగ్రెస్ సర్కారు ఏమైనా కాళేశ్వరం ప్రాజెక్టా అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. నాసిరకం సిమెంట్తో ప్రాజెక్టులు కట్టినట్టు కాదని, తమ పార్టీకి 130 ఏండ్ల చరిత్రఉందని ఆయన పేర్కొన్నారు. అంతర్యుద్ధం తమ పార్టీలో లేదని, బీఆర్ఎస్ పార్టీలోనే కుమ్ములాటలు జరుగుతున్నాయని చెప్పారు. కేసీఆర్ను వెనుక నుంచి గడ్డపారతో పొడిచేందుకు హరీశ్ సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు. గురువారం గాంధీ భవన్లో మీడియాతో జగ్గారెడ్డి మాట్లాడారు. ‘‘కేసీఆర్ తోపు అని బీఆర్ఎస్ వాళ్లు అంటున్నరు. అలాంటి తోపు ఎందుకు తుస్సయ్యాడు? కామారెడ్డిలో ఎందుకు ఓడిపోయిండు? వాటికి ప్రశాంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఎక్కువ మాట్లాడితే అన్నీ బయటకు తీస్తం. బీఆర్ఎస్ హయాంలో ఎమ్మెల్యేలు సీఎంను కలిసేవారా? కేటీఆర్, హరీశ్ను మాత్రమే కలిసేవారు” అని జగ్గా రెడ్డి వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ దగ్గరకి వస్తే సీఎంను కలిసే అవకాశం ఉంటుందన్నారు. మల్లారెడ్డి కూడా తమ దగ్గరకు రావొచ్చని సూచించారు.
హరీశ్ బ్లాక్ మనీపై సీఎంకు చెప్త
హరీశ్ రావు దగ్గర కాళేశ్వరం డబ్బులు ఉన్నాయని, రూ.60 కోట్లు పంచి బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించారని జగ్గారెడ్డి ఆరోపించారు. తన దగ్గరే అన్ని డబ్బులుంటే పట్టపగలే చుక్కలు చూపించేవాడినన్నారు. హరీశ్ నల్లధనం ఎక్కడ దాచారో సీఎంకు చెప్తానని తెలిపారు. తాను కాంగ్రెస్కు ఆయుధమని, అలాంటి ఆయుధమైన తనకు పదవులు అక్కర్లేదని చెప్పారు. సంగారెడ్డిలో జరిగే కార్యక్రమాల్లో ప్రొటోకాల్ పాటించడం లేదంటున్నారని, బీఆర్ఎస్ నేర్పిన రాజకీయాన్నే తామూ ఫాలో అవుతున్నామని చెప్పారు.