జైలు నుంచే చదువు.. పీజీలో గోల్డ్ మెడల్ కైవసం

 జైలు నుంచే చదువు.. పీజీలో గోల్డ్ మెడల్ కైవసం

మొక్కవోని పట్టుదలతో పీసీ డిగ్రీ సాధించాడు ఓ ఖైదీ.  అనుకోకుండా  జరిగిన ఓ హత్య కేసులో దోషిగా నిర్దారించబడ్డాడు.  కోర్టు అతనికి యావజ్జీవ శిక్ష విధించింది.  అయితేనేం... అంబేద్కర్​ యూనివర్శిటీ ద్వారా కరస్పాండెండ్​ కోర్సును జైలులోనే పూర్తి చేశాడు. పీజీలో గోల్డ్​ మెడల్​ సాధించి అందరికి ఆదర్శప్రాయంగా నిలిచాడు నంద్యాల జిల్లా సంజామల మండలం పేరుసోముల గ్రామానికి చెందిన మహమ్మద్ రఫి.  

హత్య కేసులో యావజ్జీవ కారాగారం శిక్ష అనుభవిస్తున్న ఖైదీ అతను. జైల్లో ఉంటూనే ఆ యువకుడు చదువులో రాణించాడు. బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పిజీ చేశాడు. ఎంఏ సోషియాలజీలో తెలుగు రాష్ట్రాల్లో నే మొదటి ర్యాంకు సాధించాడు. గోల్డ్ మెడల్ సాధించాడు. ఆ యువకుడే నంద్యాల జిల్లా సంజామల మండలం పేరుసోముల గ్రామానికి చెందిన మహమ్మద్ రఫీ. అచ్చం ఓ సినిమాలో జైలు శిక్ష పడిన యువకుడి కి అక్కడి జైలు అధికారుల సహకారంతో పట్టుదలతో ‘ లా ‘ కోర్సు చదివి న్యాయవాది పట్టాతో తన తండ్రిని దోషిగా నిరూపించేందుకు న్యాయస్థానంలో వాదించి గెలిచిన ఘటన ను 20 ఏళ్ల క్రితం స్టూడెంట్ నెంబర్ 1 సినిమాలో చూసాం.. అదే తరహాలో యావజీవ కారాగార శిక్ష పడిన ఓ యువకుడు నిజ జీవితంలో విజయం సాధించి రియల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు.

జైలు నుంచే చదువు….. పీజీ లో గోల్డ్ మెడల్ కైవసం

నంద్యాల జిల్లా సంజామల మండలం పేరు సోముల గ్రామానికి చెందిన దూదేకుల నడిపి మాబుసా. మాబున్ని కుమారుడు మహమ్మద్ రఫీ 2014లో బీటెక్ చదివేవాడు. ఆ సమయంలో ప్రేమ వ్యవహారంలో ఇదే గ్రామానికి చెందిన ఓ యువతి హత్యకు కారకుడు అయ్యాడని భావించి ఆ యువకుడు పై సంజామల పోలీస్ స్టేషన్లో హత్య కేసు నమోదయింది. కోర్టులో విచారణ అనంతరం 2019 జూలై నెలలో రఫీకి జీవిత ఖైదీ విధించారు. అప్పటి నుంచి కడప కేంద్ర కారాగరంలో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఖైదీలను సైతం అక్షరాశులుగా తీర్చిదిద్దాలని సంకల్పంతో అక్కడి జైలు అధికారులు చదువుపై ఆసక్తి ఉన్నవారిని గుర్తించి పది చదివిన వారిని దూర విద్య కోర్సుల ద్వారా పై చదువులను ప్రోత్సహించారు. 2020లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పిజి చేసేందుకు అవకాశం కల్పించారు.

తెలుగు రాష్ట్రంలో మొదటి ర్యాంకు

మహమ్మద్ రఫీ ఎంఏ సోషియాలజీలో అడ్మిషన్ పొందారు. వివిధ రకాల పుస్తకాలు స్టడీ మెటీరియల్ ను సమకూర్చుకొని జైలులోనే నాలుగు గోడల మధ్య కష్టపడి చదివాడు. కోర్టు ఆదేశాల మేరకు జైలు అధికారులు 2022లో పరీక్షలకు రాసేందుకు అనుమతిచ్చారు. అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకొని యూనివర్సిటీ పరిధిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి ఎంఏ సోషియాలజీలో మొదటి ర్యాంకుతో గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నాడు.

జైలులో ఉంటున్న మహమ్మద్ రఫీకి పీజీ పట్టా గోల్డ్ మెడల్ ప్రధానం చేయాలని యూనివర్సిటీ అధికారులు ఇటీవల జైలు అధికారులకు సమాచారం అందించారు. కోర్టు అనుమతితో నాలుగు రోజులు బెయిల్ మంజూరు కావడంతో గురువారం హైదరాబాదులోని అంబేద్కర్ యూనివర్సిటీలో వైస్ చాన్సలర్ జగదీష్ ఆధ్వర్యంలో గోల్డ్ మెడల్ బహుకరించి అభినందనలు తెలియజేశారు.. ఈ సందర్భంగా రఫీ మాట్లాడుతూ తన జీవితం జైలు పాలైనప్పటికీ చదువుపై ఉన్న మమకారంతో పట్టుదలతో పీజీ సాధించానని చెప్పాడు. తన తల్లిదండ్రులకు ఈ గోల్డ్ మెడల్ అంకితం చేస్తున్నట్లు తెలిపారు