ముషీరాబాద్, వెలుగు : కుటుంబ, కుల పార్టీలకు వ్యతిరేకంగా బహుజన సమాజమంతా కలిసికట్టుగా పోరాడాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. దోమలగూడ లోని బీసీ భవన్ లో శుక్రవారం కాన్షీరామ్ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా కాన్షీరామ్ ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. బహుజన సిద్ధాంతాన్ని సమాజానికి అందించిన మేధావి కాన్షీరామ్ అన్నారు.
ఆయన ఆశయాల కోసం నిరంతరం కృషి చేయాలన్నారు. బహుజనులను పాలకులుగా తీర్చిదిద్దిన ఘనత కాన్షీరామ్ కే దక్కుతుందన్నారు. రెండు, మూడు శాతం కూడా లేని కులాల వారు తరతరాలుగా పరిపాలిస్తున్నారన్నారు. బీసీ విద్యార్థి సంఘం కేంద్ర అధ్యక్షుడు విక్రమ్ గౌడ్, బీసీ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బి.మణి మంజరి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు స్వర్ణ గౌడ్, రాష్ట్ర కార్యదర్శి సమతా, బీసీ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మధు, బీసీ సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు రాజేందర్ పాల్గొన్నారు. బంధు సొసైటీ ఆధ్వర్యంలో బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కాన్షీరామ్జయంతి నిర్వహించారు. రిటైర్డ్ ఐఆర్టీఎస్ అప్పికట్ల భరత్ భూషణ్ పాల్గొన్నారు.