
- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్, వెలుగు: ఎల్ బీ స్టేడియంలో శుక్రవారం జరగనున్న కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయ బేరి సభలో బీసీ రిజర్వేషన్ల పెంపుపై ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే స్పష్టమైన ప్రకటన చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కులగణన జరిగిన తర్వాత అసెంబ్లీలో చేసిన రిజర్వేషన్ల బిల్లు, ఢిల్లీకి వెళ్లి మూడు నెలలు కావొస్తున్న ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించలేదని గురువారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో తెలిపారు.
ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ నాయకత్వంలో అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లి ప్రధానిని కలిసి ఒత్తిడి తీసుకురావాలని ఆయన కోరారు. ఇందులో భాగంగా ఈ నెల 21 నుంచి జరిగే పార్లమెంటు సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ల బిల్లు ఎజెండాగా ఉద్యమించడానికి మల్లికార్జున ఖర్గే సభలో స్పష్టమైన కార్యాచరణను ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.
కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడంతో దానిని అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైనే ఉందని,ఈ బాధ్యతను జాతీయ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే తీసుకోవాలని జాజుల కోరారు.