ఖమ్మం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. క్లాస్ రూమ్ లో డెమో ఇస్తూ గుండెపోటుతో కుప్పకూలాడు ఓ ఉపాధ్యాయుడు. శనివారం ( మే 9 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..ఖమ్మం జిల్లా మధిరలో చోటు చేసుకుంది ఈ విషాద ఘటన. జిల్లాలోని మధిర పట్టణం రెండోవార్డు ఎంప్లాయిస్ కాలనీకి చెందిన ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు గారపాటి జయరాజ్ ఖమ్మంలోని మమతా రోడ్ లో ఉన్న శ్రీ చైతన్య ఒలంపియాడ్ స్కూల్ లో వర్క్ షాప్ కి హాజరయ్యాడు.
వర్క్ షాప్ లో భాగంగా క్లాస్ రూమ్ లో డెమో ఇస్తుండగా గుండెపోటుతో కుప్పకూలాడు జయరాజ్. డెమో ఇస్తున్న జయరాజ్ ఒక్కసారిగా కుప్పకూలడంతో అతనిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు సహా ఉపాధ్యాయులు. అయితే.. అప్పటికే జయరాజ్ మరణించినట్లు తెలిపారు డాక్టర్లు.
►ALSO READ | హైదరాబాద్ సిటీ ఆర్సీపురంలో విషాదం.. లిఫ్టులో ఇరుక్కొని బాలుడు మృతి
జయరాజ్ డెమో ఇస్తూ కుప్పకూలిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. జయరాజ్ మరణంతో అతని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అప్పటిదాకా హుషారుగా పాఠం చెబుతున్న జయరాజ్ ఒక్కసారిగా కుప్పకూలడం జీర్ణించుకోలేక పోతున్నామని అంటున్నారు తోటి ఉపాధ్యాయులు. ఈ ఘటనతో మధిర పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
