కోదాడ నుంచి హైదరాబాద్ వరకు జన ఆశీర్వాద యాత్ర

కోదాడ నుంచి హైదరాబాద్ వరకు జన ఆశీర్వాద యాత్ర

హైదరాబాద్: కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తలపెట్టిన జన ఆశీర్వాద యాత్ర ఆగస్టు 19న ప్రారంభంకానుంది. ఈ యాత్ర ఆగస్టు 19న కోదాడలో ప్రారంభమై ఆగస్టు 21న హైదరాబాదులో ముగియనుంది. భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం, ఎన్డీఏ ప్రభుత్వం సూచన మేరకు కిషన్ రెడ్డి ఈ యాత్రను చేపట్టారు.

ఆగస్టు 19 సాయంత్రం నాలుగు గంటలకు కోదాడలో జన ఆశీర్వాద యాత్ర ప్రారంభమవుతుంది. యాత్ర సూర్యాపేటకు చేరుకున్న తర్వాత అక్కడే బస చేస్తారు. మరుసటి రోజు 20వ తేదీన దంతాలపల్లి మీదుగా తొర్రూరు, రాయపర్తి, వర్ధన్నపేట, వరంగల్ లో భద్రకాళి మాత దర్శనం, వరంగల్, హనుమకొండ లో తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తారు. వరంగల్ లో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత వ్యాక్సినేషన్ సెంటర్ ను సందర్శించి ప్రజలకు అందిస్తున్న విధానాన్ని పరిశీలిస్తారు. అనంతరం ఖిల్లాషాపూర్ లో సర్వాయి పాపన్న గ్రామం నుంచి జనగామ, ఆలేరు, యాదగిరిగుట్ట చేరుకుంటారు. పద్మశ్రీ అవార్డు గ్రహిత, ఆలేరుకు చెందిన చేనేత కళాకారులు చింతకింది మల్లేష్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. యాదగిరిగుట్టలో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో దర్శనం చేసుకున్న అనంతరం యాదగిరిగుట్టలో రాత్రి బస చేస్తారు. తర్వాతి రోజైన 21న ఉదయం భువనగిరిలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యం ప్రజలకు చేరుతున్న విధానాన్ని రేషన్ షాప్ ద్వారా పరిశీలిస్తారు. అనంతరం ఘట్కేసర్, ఉప్పల్ మీదుగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం మీదుగా నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద రాత్రి 7 గంటలకు సభ ఉంటుంది. 

ఈ జన ఆశీర్వాద యాత్ర కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మరియు పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె. లక్ష్మణ్, రాష్ట్ర పదాధికారులు, సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొంటారు.

ఈ యాత్ర 12 జిల్లాలు, 7 పార్లమెంట్ నియోజకవర్గాలు, 17 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా.. 324 కిలోమీటర్ల మేర కిషన్ రెడ్డి నేతృత్వంలో జన ఆశీర్వాద యాత్ర జరుగుతుంది. ఈ యాత్రలో తెలంగాణ ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి చేస్తుంది.

ప్రధాని మోడీ రైతాంగానికి లాభసాటి చేసే విధంగా విధానాలు రూపొందించడం, పేద ప్రజల కోసం చేపడుతున్న సంక్షేమ మరియు అభివృద్ధి విషయాలను ప్రధానంగా ఈ యాత్రలో ప్రస్తావిస్తారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ.. ముందుకు సాగడమే ఈ యాత్ర యొక్క ప్రధాన ఉద్దేశం.