కంచాలు కడిగిన అటెండర్ నే లంచం అడిగిన్రు

కంచాలు కడిగిన అటెండర్ నే లంచం అడిగిన్రు
  • జనగామ డీఎస్సీడీవో, సూపరింటెండెంట్​ కక్కుర్తి
  • ప్లేట్లు కడిగి సేవ చేసినందుకు గిట్ల జేస్తరా? : బాధితుడు
  • ఇద్దరు ఆఫీసర్లనూ రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్న ఏసీబీ

జనగామ, వెలుగుమొన్నటి వరకు ఆ ఇద్దరు ఆఫీసర్లకు అటెండర్​గా ఆయన ఎన్నో సేవలు చేసిపెట్టాడు. తిన్న కంచాలు కడిగిపెట్టేవాడు.. చాయ్​లు తెమ్మంటే ఠక్కున తెచ్చిపెట్టేవాడు.. ఫైళ్లు మొయ్యమంటే మోసిపెట్టేవాడు. అలాంటి వ్యక్తి ఇటీవలే రిటైర్​అయి.. రిటైర్మెంట్​ పేపర్లపై సంతకాల కోసం ఆ ఇద్దరు ఆఫీసర్లను కలిస్తే.. వాళ్లు లంచం కోసం కక్కుర్తిపడ్డారు. రూ. 10వేలు ముట్టజెప్తేనే పనిచేసి పెడుతామంటూ పట్టుబట్టారు. ఇచ్చుకునే స్థోమత లేదన్నా వినలేదు.రూ. 5 వేలన్నా తేవాలని డిమాండ్​ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఆ ఇద్దరు ఆఫీసర్లను ఏసీబీ వలపన్ని రెడ్​హ్యాండెండ్​గా పట్టుకుంది. ఈ సంఘటన జనగామ జిల్లా కేంద్రంలో జరిగింది.

జనగామ డిస్ట్రిక్​ ఎస్సీ డెవలప్​మెంట్​ ఆఫీసులో అటెండర్​గా పనిచేసే రేణికుంట్ల అయిలయ్య గత ఏడాది డిసెంబర్​ 31న రిటైర్​ అయ్యారు. తన రిటైర్మెంట్​ బెనిఫిట్స్  పేపర్లపై సంతకాలు పెట్టాలని అక్కడి ఎస్సీ  డెవలప్​మెంట్ ఆఫీసర్​( డీఎస్సీ​డీవో) జి. గట్టు మల్లు, సూపరింటెండెంట్  ఖదీరుద్దీన్​ను అయిలయ్య వేడుకున్నాడు. దీని కోసం రెండు నెలల నుంచి వాళ్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. అయితే.. లంచంగా  రూ. 10 వేలు ఇస్తేనే సంతకం పెడుతామని ఇద్దరు అధికారులు డిమాండ్​ చేశారు. తన దగ్గర డబ్బులు లేవన్నా పట్టించుకోలేదు. ఆఖరికి రూ. 5 వేలైనా తీసుకురావాలని డిమాండ్​ చేయడంతో.. గత్యంతరంలేక బాధితుడు అయిలయ్య ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ  చెప్పినట్లుగా.. శనివారం మధ్యాహ్నం అయిలయ్య రూ . 5 వేలు తీసుకొని ఎస్సీ డెవలప్​మెంట్​ ఆఫీసుకు వెళ్లాడు. ఆయన దగ్గర డీఎస్సీడీవో గట్టు మల్లు రూ. 3వేలు, సూపరింటెండెంట్​ ఖదీరుద్దీన్​రూ. 2వేలు తీసుకొని జేబులో పెట్టుకున్నారు. అప్పటికే అక్కడికి చేరుకున్న ఏసీబీ అధికారులు రెడ్​హ్యాండెడ్​గా వాళ్లిద్దరిని పట్టుకొని, లంచం డబ్బులను స్వాధీనం చేసుకున్నారు. గట్టు మల్లు, ఖదీరుద్దీన్​పై కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించినట్లు ఏసీబీ డీఎస్పీ మధుసూదన్​ తెలిపారు.

మీ ప్లేట్లు కడిగిన కదా సార్​ అన్నా వినలే..

నేను అటెండర్​గా ఆఫీసర్ల దగ్గర ప్లేట్లు కడిగిన.. సేవలు జేసిన. నా రిటైర్మెంట్​ కాగితాలమీద  సంతకాలు పెట్టమంటే డీఎస్సీడీవో గట్టు మల్లు సారు 2 నెలల నుంచి తిప్పుతుండు. మీ ప్లేట్లు కూడా కడిగినకదా సార్​.. దండం పెడత. సంతకం పెట్టండి అని బతిమిలాడిన. పట్టించుకో లేదు. ఎందుకత్తాన్నవ్​.. నువ్వత్తే పెడ్తమా.. పెట్టేటప్పుడే పెడ్తం అని కసురుకున్నడు.. సూపరింటెండెంట్​ ఖదీరుద్దీన్​ సార్​ను కలువుపో అని గట్టు మల్లు సార్​ చెప్పిండు. పోయి ఆయన్ని కలిస్తే 10 వేలు అడిగిండు. నేను అటెండర్​ను సార్​.. నా దగ్గర గన్ని పైసలు లేవన్నా ఇనిపించుకోలే. లాస్టుకు 5 వేలు తెమ్మన్నరు. నేను ప్లేట్లు కడిగి సేవలు జేస్తే గిదా లెక్క?

– బాధితుడు రేణికుంట్ల అయిలయ్య