
- జనగామ డీఎస్సీడీవో, సూపరింటెండెంట్ కక్కుర్తి
- ప్లేట్లు కడిగి సేవ చేసినందుకు గిట్ల జేస్తరా? : బాధితుడు
- ఇద్దరు ఆఫీసర్లనూ రెడ్హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ
జనగామ, వెలుగు: మొన్నటి వరకు ఆ ఇద్దరు ఆఫీసర్లకు అటెండర్గా ఆయన ఎన్నో సేవలు చేసిపెట్టాడు. తిన్న కంచాలు కడిగిపెట్టేవాడు.. చాయ్లు తెమ్మంటే ఠక్కున తెచ్చిపెట్టేవాడు.. ఫైళ్లు మొయ్యమంటే మోసిపెట్టేవాడు. అలాంటి వ్యక్తి ఇటీవలే రిటైర్అయి.. రిటైర్మెంట్ పేపర్లపై సంతకాల కోసం ఆ ఇద్దరు ఆఫీసర్లను కలిస్తే.. వాళ్లు లంచం కోసం కక్కుర్తిపడ్డారు. రూ. 10వేలు ముట్టజెప్తేనే పనిచేసి పెడుతామంటూ పట్టుబట్టారు. ఇచ్చుకునే స్థోమత లేదన్నా వినలేదు.రూ. 5 వేలన్నా తేవాలని డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఆ ఇద్దరు ఆఫీసర్లను ఏసీబీ వలపన్ని రెడ్హ్యాండెండ్గా పట్టుకుంది. ఈ సంఘటన జనగామ జిల్లా కేంద్రంలో జరిగింది.
జనగామ డిస్ట్రిక్ ఎస్సీ డెవలప్మెంట్ ఆఫీసులో అటెండర్గా పనిచేసే రేణికుంట్ల అయిలయ్య గత ఏడాది డిసెంబర్ 31న రిటైర్ అయ్యారు. తన రిటైర్మెంట్ బెనిఫిట్స్ పేపర్లపై సంతకాలు పెట్టాలని అక్కడి ఎస్సీ డెవలప్మెంట్ ఆఫీసర్( డీఎస్సీడీవో) జి. గట్టు మల్లు, సూపరింటెండెంట్ ఖదీరుద్దీన్ను అయిలయ్య వేడుకున్నాడు. దీని కోసం రెండు నెలల నుంచి వాళ్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. అయితే.. లంచంగా రూ. 10 వేలు ఇస్తేనే సంతకం పెడుతామని ఇద్దరు అధికారులు డిమాండ్ చేశారు. తన దగ్గర డబ్బులు లేవన్నా పట్టించుకోలేదు. ఆఖరికి రూ. 5 వేలైనా తీసుకురావాలని డిమాండ్ చేయడంతో.. గత్యంతరంలేక బాధితుడు అయిలయ్య ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ చెప్పినట్లుగా.. శనివారం మధ్యాహ్నం అయిలయ్య రూ . 5 వేలు తీసుకొని ఎస్సీ డెవలప్మెంట్ ఆఫీసుకు వెళ్లాడు. ఆయన దగ్గర డీఎస్సీడీవో గట్టు మల్లు రూ. 3వేలు, సూపరింటెండెంట్ ఖదీరుద్దీన్రూ. 2వేలు తీసుకొని జేబులో పెట్టుకున్నారు. అప్పటికే అక్కడికి చేరుకున్న ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా వాళ్లిద్దరిని పట్టుకొని, లంచం డబ్బులను స్వాధీనం చేసుకున్నారు. గట్టు మల్లు, ఖదీరుద్దీన్పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీబీ డీఎస్పీ మధుసూదన్ తెలిపారు.
మీ ప్లేట్లు కడిగిన కదా సార్ అన్నా వినలే..
నేను అటెండర్గా ఆఫీసర్ల దగ్గర ప్లేట్లు కడిగిన.. సేవలు జేసిన. నా రిటైర్మెంట్ కాగితాలమీద సంతకాలు పెట్టమంటే డీఎస్సీడీవో గట్టు మల్లు సారు 2 నెలల నుంచి తిప్పుతుండు. మీ ప్లేట్లు కూడా కడిగినకదా సార్.. దండం పెడత. సంతకం పెట్టండి అని బతిమిలాడిన. పట్టించుకో లేదు. ఎందుకత్తాన్నవ్.. నువ్వత్తే పెడ్తమా.. పెట్టేటప్పుడే పెడ్తం అని కసురుకున్నడు.. సూపరింటెండెంట్ ఖదీరుద్దీన్ సార్ను కలువుపో అని గట్టు మల్లు సార్ చెప్పిండు. పోయి ఆయన్ని కలిస్తే 10 వేలు అడిగిండు. నేను అటెండర్ను సార్.. నా దగ్గర గన్ని పైసలు లేవన్నా ఇనిపించుకోలే. లాస్టుకు 5 వేలు తెమ్మన్నరు. నేను ప్లేట్లు కడిగి సేవలు జేస్తే గిదా లెక్క?
– బాధితుడు రేణికుంట్ల అయిలయ్య