జనగామ మున్సిపల్‌‌ బడ్జెట్‌‌ 27.43 కోట్లు

జనగామ మున్సిపల్‌‌ బడ్జెట్‌‌ 27.43 కోట్లు
  •     ఆమోదం తెలిపిన కౌన్సిల్‌‌ సభ్యులు
  •     అంకెల గారడీ అన్న విపక్ష సభ్యులు

జనగామ, వెలుగు : జనగామ మున్సిపాలిటీ 2024–-25 సంవత్సరానికి సంబంధించి రూ. 27.43 కోట్లతో రూపొందించిన బడ్జెట్‌‌కు గురువారం కౌన్సిల్‌‌ ఆమోదముద్ర తెలిపింది. చైర్‌‌పర్సన్‌‌ పోకల జమున లింగయ్య అధ్యక్షతన గురువారం స్థానికంగా ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి అడిషనల్‌‌ కలెక్టర్‌‌ పింకేశ్‌‌ కుమార్‌‌ హాజరయ్యారు.

మొత్తం బడ్జెట్‌‌లో ప్రాపర్టీ ట్యాక్స్‌‌, టౌన్‌‌ ప్లానింగ్‌‌, ప్రజారోగ్యం వంటి మార్గాల ద్వారా రూ.11.71 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. నాన్‌‌ప్లాన్‌‌, ప్లాన్, ఇతర గ్రాంట్స్​ద్వారా రూ. 15.66 కోట్ల ఇన్‌‌కం రానుందని అంచనాలు రూపొందించారు. గతేడాది మిగులుగా రూ.71.90 లక్షలను చూపారు. గతేడాది బడ్జెట్​ రూ.20.02 కోట్లు కాగా ఈ సారి మరో రూ. 7 కోట్లు పెంచి బడ్జెట్‌‌ను రూపొందించారు. అయితే కౌన్సిల్‌‌ సభ్యులు అభ్యంతరాలు చెబుతూనే బడ్జెట్‌‌కు ఆమోదం తెలిపారు.

అంకెలే మారినయ్‌‌

జనగామ మున్సిపల్‌‌ బడ్జెట్‌‌పై విపక్ష సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్‌‌లో అంకెలు మాత్రమే మారాయని, వాస్తవానికి దూరంగా బడ్జెట్‌‌ను రూపొందించారన్నారు. బీజేపీ మున్సిపల్‌‌ ఫ్లోర్‌‌ లీడర్‌‌ మహంకాళి హరిశ్చంద్ర గుప్తా మాట్లాడుతూ ప్రాపర్టీ ట్యాక్స్‌‌ను గతేడాది కంటే రూ. కోటి పెంచి చూపించారని,  దానిని ఏ విధంగా పెంచారన్న వివరాలు మాత్రం లేవన్నారు. గతంలో మున్సిపాలిటీకి స్టాంప్ డ్యూటీ కింద రిజిస్ట్రేషన్‌‌ ఆఫీస్‌‌ నుంచి డైరెక్ట్‌‌గా ఆదాయం వచ్చేదని, కానీ ఆ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం వల్ల ఇన్‌‌కం తగ్గిందన్నారు.

ఆ నిధులు మున్సిపాలిటీలకు వచ్చేలా తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపాలని కోరారు. కాంగ్రెస్ డిప్యూటీ ఫ్లోర్‌‌ లీడర రామచందర్‌‌ మాట్లాడుతూ మున్సిపల్‌‌ ఆదాయం పెరగాలంటే ట్రేడ్​లైసెన్స్‌‌లను సక్రమంగా వసూలు చేయాలన్నారు. జక్కుల అనిత మాట్లాడుతూ బడ్జెట్‌‌ సమావేశానికి ఎమ్మెల్యే రాకపోవడం ఏమిటని ప్రశ్నించారు. కార్మికులకు సబ్బులు, నూనె ఇచ్చినట్టు బడ్జెట్‌‌లో రాశారని, కానీ వాటిని ఏనాడూ కార్మికులకు ఇవ్వడం లేదన్నారు.

Also read : 87.05 కోట్లతో పేట మున్సిపల్ బడ్జెట్

వాంకుడోతు అనిత మాట్లాడుతూ బ్లీచింగ్‌‌ పౌడర్‌‌, దోమల మందు పేరిట బడ్జెట్‌‌లో నిధులు చూపిస్తున్నా, వార్డుల్లో మాత్రం బ్లీచింగ్‌‌ చల్లడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో కమిషనర్‌‌ పి. వెంకటేశ్వర్లు, వైస్‌‌ చైర్మన్‌‌ మేకల రాంప్రసాద్, మేనేజర్‌‌ రాములు, శానిటరీ ఇన్స్‌‌పెక్టర్‌‌ మల్లిగారి మధు పాల్గొన్నారు. 

ముందస్తు మొక్కులకు తరలొచ్చిన భక్తులు

మేడారం జాతరకు మరో ఐదు రోజులే ఉండడంతో ముందస్తు మొక్కులు చెల్లించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. గురువారం పెద్ద ఎత్తున రావడంతో ఆలయ పరిసరాలు, పస్రా, తాడ్వాయి రోడ్లు భక్తులు, వాహనాలతో కిటకిటలాడాయి. భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం అమ్మవార్లను దర్శించకొని నిలువెత్తు బంగారం సమర్పించారు.  

- తాడ్వాయి, వెలుగు