న్యూఢిల్లీ: కొత్తగా రూపొందించనున్న ప్రపంచ పటంలో.. భారత భూభాగం ఉన్నది ఉన్నట్టుగానే కనిపించాలని యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీకి మన దేశం స్పష్టం చేసింది. జమ్మూకాశ్మీర్, లడఖ్తోపాటు దేశంలోని ఏ ప్రాంతాన్నైనా తప్పుదోవ పట్టించేలా చూపిస్తే అంగీకరించేదిలేదని తేల్చి చెప్పింది.
భారత సార్వభౌమ భూభాగాన్ని అధికారిక భారత మ్యాప్ ప్రకారమే చూపించాలంది. ప్రపంచంలోని దేశాలు, ఖండాలు వాటి అసలు విస్తీర్ణాలను మరింత కచ్చితంగా చూపించే కొత్త ‘ఈక్వల్ ఎర్త్’ ప్రపంచ పటాన్ని రూపొందించాలంటూ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఈ నెల 5న తెచ్చిన తీర్మానానికి భారత్ మద్దతు తెలిపింది. తమ మద్దతు మ్యాప్ గీసేందుకు మాత్రమేనని, ప్రపంచ దేశాల అధికారిక బార్డర్లను గీయడానికి అంగీకరించడం కాదని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు.
