
- టాలెంటెడ్ యువత ఎక్కువ ఉండటంతో మనవైపు అడుగులు
- ఇప్పటికే 85 జీసీసీలు.. 1.85 లక్షల మంది ఉద్యోగులు
- 2028 నాటికి 150కి పెరిగే అవకాశం
- 2026 చివరి నాటికి 12 జీసీసీలు వచ్చే చాన్స్.. అందులో ఎక్కువ హైదరాబాద్లోకే
హైదరాబాద్, వెలుగు: గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ) ఏర్పాటుకు జపాన్.. ఇండియావైపు చూస్తున్నది. ఆ దేశంలో వృద్ధులు పెరిగిపోతుండడం, పనిచేసే యువత తగ్గిపోతుండటంతో.. మన దేశంలోని అత్యంత నైపుణ్యమున్న ప్రతిభావంతులవైపు జపాన్ మొగ్గు చూపుతున్నది. ప్రస్తుతం ఆ దేశంలో 30 శాతం మందికిపైగా 65 ఏండ్లకు పైబడిన వారే ఉన్నారు. దీంతో ఆ దేశ వర్క్ ఫోర్స్ భారీగా పడిపోతున్నది.
2040 నాటికి ఆ దేశంలో పనిచేసే వారి సంఖ్య కోటి మందికిపైగా పడిపోతుందని పలు సంస్థలు చేసిన అధ్యయనంలో తేలడంతో ఆ దేశంలోని ప్రముఖ కంపెనీలకు ఆందోళన మొదలైనట్టుగా నిపుణులు చెప్తున్నారు. ఇటు 2030 నాటికి దాదాపు 6 లక్షల మంది ఐటీ ఉద్యోగుల కొరత కూడా ఏర్పడుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాఇయి. ఇండియా కాకుండా అమెరికా, చైనా వంటి దేశాల్లో జీసీసీలను ఏర్పాటు చేయడంతో.. కంపెనీలకు ధరా భారంగానూ మారుతున్నట్టు చెప్తున్నారు.
ఈ క్రమంలో కాస్ట్ను తగ్గించుకునేందుకు, టెక్నాలజీ, ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)లో ప్రతిభ కలిగిన మానవ వనరులు మన దగ్గర ఎక్కువగా ఉండడంతో ఇటువైపు ఆసక్తి చూపిస్తున్నట్టుగా మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,800 జీసీసీలుండగా.. అందులో జపాన్కు చెందిన సంస్థలే 85 ఉన్నాయి. దాదాపు 5 శాతం జీసీసీలు ఆ దేశానికి చెందినవే. ఆయా సంస్థల్లో ప్రస్తుతం 1.85 లక్షల మంది పనిచేస్తున్నారు.
అయితే, 2028 నాటికి జపాన్కు చెందిన జీసీసీలు రెట్టింపవుతాయని, 150 వరకు జీసీసీల ఏర్పాటుకు అవకాశముందని అంటున్నారు. వాటి ద్వారా 3.5 లక్షల మందికి ఉపాధి దొరకుతుందని, ఏటా రూ.22 వేల కోట్లకుపైగా (250 కోట్ల డాలర్లు) పెట్టుబడులు వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఇటీవలే జపాన్కు చెందిన ప్రముఖ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ దాయిచి లైఫ్ హైదరాబాద్లో జీసీసీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్లో రాబోయే కాలంలో జపాన్కు చెందిన మరిన్ని సంస్థలు జీసీసీలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. హైదరాబాద్లో ఉన్న మానవ వనరులు, ప్రభుత్వం తరఫున ప్రోత్సాహకాలు, స్ట్రాటజిక్ లొకేషన్ వంటివి కలిసి వస్తాయని చెప్తున్నారు.
ఏడాది నుంచి బాగా పెరిగింది
మన దేశంలో జపాన్ జీసీసీల ఏర్పాటు ఐదేండ్లుగా పెరుగుతూ వస్తున్నదని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యంగా గతేడాది నుంచి క్రమంగా వాటి ఏర్పాటు ఎక్కువ అవుతున్నదని గుర్తు చేస్తున్నాయి. 2024లో ఐదు జీసీసీలు ఏర్పాటవగా.. ఈ ఏడాది జనవరి నుంచి మరో 5 కొత్త జపాన్ జీసీసీలు దేశంలోకి ఎంట్రీ ఇచ్చాయి. 2026 చివరి నాటికి మరో 12 దాకా ఏర్పాటయ్యే అవకాశం ఉంది. అందులో ఓ నాలుగైదు జీసీసీలు హైదరాబాద్లోనూ ఏర్పాటయ్యేందుకు చాన్సులున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం మన దేశంలో జపాన్కు చెందిన ప్రముఖ బ్యాంకులు, ఇన్సూరెన్స్ సంస్థలు జీసీసీలను ఏర్పాటు చేశాయి. కొన్ని సంస్థలు ఇప్పటికే దేశంలో మాన్యుఫ్యాక్చరింగ్ చేస్తున్న కొన్ని సంస్థలు.. జీసీసీల ద్వారా టెక్నాలజీ, ఆపరేషన్స్ను మెరుగుపరచుకోవాలని భావిస్తున్నాయి. అయితే, జపాన్ జీసీసీల ఏర్పాటు చాలా నెమ్మదిగా సాగుతున్నట్టు మార్కెట్ నిపుణులు చెప్తున్నారు.
మామూలుగా ఇతర దేశాలకు చెందిన జీసీసీలు గరిష్టంగా 6 నెలల్లో జీసీసీలను ఏర్పాటు చేస్తుండగా.. జపాన్కు చెందిన సంస్థలు మాత్రం ఏడాది నుంచి ఏడాదిన్నర టైమ్ తీసుకుంటున్నాయంటున్నారు. వార్షిక ఒప్పందాలు కాకుండా.. మూడేండ్ల కాలపరిమితితో వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడంపైనే జపాన్ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయంటున్నారు.
తక్కువ మంది ఉద్యోగులే..
జపాన్ కంపెనీలు తక్కువ మంది ఉద్యోగులతోనే జీసీసీలను నడుపుతున్నాయి. సగటున 500 మందితోనే పనిచేస్తున్నాయి. 2019–2020 వరకు ఇదే ట్రెండ్ కొనసాగింది. అయితే, ఇప్పుడిప్పుడే ఆ ట్రెండ్ను ఆ సంస్థలు మారుస్తున్నట్టు ప్రస్తుత గణాంకాలు చూస్తే తెలుస్తున్నది. రిస్క్, ఇంటర్నల్ ఆడిట్, ఎంటర్ప్రైజ్ ఫైనాన్స్లోకి జీసీసీలను తీసుకొస్తున్న సంస్థలు.. సగటున వెయ్యి మందికిపైగా ఉద్యోగులను కొన్ని పెద్ద సంస్థలు నియమించుకుంటున్నాయి. మిగితా దేశాలతో పోలిస్తే.. ఇండియాలో ఖర్చు కూడా 40 శాతం వరకు ఆదా అవుతుండడంతో జపాన్ జీసీసీలు మెల్లమెల్లగా ఇండియావైపు కదులుతున్నాయంటున్నారు.
ఇదే కాకుండా జపాన్ వర్క్ కల్చర్తో ఇండియన్ ఎంప్లాయ్స్ సూట్ అయ్యేలా బిహేవియరల్ ట్రైనింగ్నూ ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం జపాన్కు చెందిన సోనీ, నోమురా, రాకుటెన్, హిటాచి, మిజుహో, కెనాన్, డెన్సో, ఇసుజు, నిస్సాన్, సుజుకీ, టయోటా మోటార్స్, తోషిబా వంటి ప్రముఖ సంస్థలు ఇప్పటికే ఇండియాలో జీసీసీలను ఏర్పాటు చేశాయి. ఇంజనీరింగ్, ఐటీ సర్వీసెస్, ఆటోమోటివ్ డిజైన్, ఆర్థిక కార్యకలాపాలపైనే ఈ జపనీస్ జీసీసీలు పనిచేస్తుండడం విశేషం.