- ఆసియా గేమ్స్కూ ఇదే జట్టు
న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్కు ఇండియా జట్టును ప్రకటించారు. మంగళవారం సమావేశమైన సెలెక్షన్ కమిటీ మొత్తం 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఇదే జట్టును ఈ నెల చివర్లో జపాన్ (ఐచీనగోయా)లో జరిగే ఆసియా క్రీడలకు కూడా పంపనున్నారు. మోకాలి గాయం నుంచి కోలుకున్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ఆల్రౌండర్లు నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, పేసర్ హర్షిత్ రాణాలకు జట్టులో చోటు కల్పించింది. అయితే వీళ్లందరు మ్యాచ్ ఫిట్నెస్ను నిరూపించుకోవాల్సి ఉంటుంది.
ఇంగ్లండ్తో జరిగిన వన్డే సిరీస్లో మోకాలి గాయానికి గురైన బుమ్రా.. తర్వాత శ్రీలంకతో జరిగిన రెండు టెస్ట్ల సిరీస్కు దూరమయ్యాడు. 2027 వన్డే వరల్డ్ కప్ను దృష్టిలో పెట్టుకుని బుమ్రా, హార్దిక్ పాండ్యాను జాగ్రత్తగా వాడుకోవాలని బీసీసీఐ భావిస్తోంది. ఇక ఇంగ్లండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ సందర్భంగా హర్షిత్ రాణా తొడ కండరాల గాయానికి గురయ్యాడు. చెన్నైలో అఫ్గానిస్తాన్తో జరిగిన మూడో వన్డేలో నితీశ్ గాయపడ్డాడు. ఓవరాల్గా బుమ్రా, నితీశ్, హర్షిత్, సుందర్ను రిటర్న్ టు ప్లే నిబంధన కింద జట్టులోకి తీసుకున్నారు. అఫ్గాన్తో ఈ నెల 13, 15, 17న ఢిల్లీలో ఈ మ్యాచ్లు జరగనున్నాయి.
ఇండియా టీ20 జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, శివమ్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డి*, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్*, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా*, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా*.
