హైదరాబాద్: దివంగత మాజీ కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ జయంతి వేడుకలు ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఆమె జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల్లో నిర్వహిస్తున్నామని తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి . ప్రతిపక్ష నేతగా, కేంద్రమంత్రిగా తన విధులను సమవర్ధవంతంగా నిర్వహించారని, బీజేపీ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారని మంత్రి ఈ సందర్భంగా అన్నారు. తెలంగాణ ఏర్పాటులో సుష్మా స్వరాజ్ అండగా నిలబడ్డారని చెప్పారు. పార్లమెంట్ లో తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించిన ఘనత సుష్మా స్వరాజ్ కే దక్కుతుందన్నారు. ఉస్మానియా విద్యార్థులపై అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ దాష్టీకాన్ని లేవనెత్తి విద్యార్థులకు అండగా నిలబడ్డారన్నారు.
తెలంగాణ బిల్లు పాస్ అవడంలో సుష్మా స్వరాజ్ కీలక పాత్ర పోషించారని అన్నారు కిషన్ రెడ్డి. బిల్లు ఆమోద సమయంలో తెలంగాణ కు అనుకూలంగా మాట్లాడింది సుష్మా స్వరాజేనని తెలిపారు. కాంగ్రెస్- టీడీపీ సభ్యులు సభను అడ్డుకోవాలని చూడగా.. అలాంటి ఎత్తుగడలను ఛిద్రం చేసి తెలంగాణ బిల్లు పాస్ అవడానికి ఆమె కృషి చేసిందన్నారు. తెలంగాణ ప్రజలకు, గల్ఫ్ లో బాధలు పడ్డ ఎంతోమందికి ఆమె సహకారం అందించారన్నారు. తెలంగాణ ప్రజల హృదయాల్లో సుష్మా స్వరాజ్ చిరస్మరణీయంగా నిలిచిపోయారని మంత్రి తెలిపారు