- అప్రూవల్స్ కోసం చూస్తున్నాం
- మళ్లీ అన్ని రూట్లలో పనిచేస్తాం..
- జెట్ ఎయిర్వేస్ వెల్లడి
ముంబై : వచ్చే ఏడాది వేసవి నాటికి జెట్ ఎయిర్వేస్ విమానాలు మళ్లీ ఎగిరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు కొనుగోలుదారులు వెల్లడించారు. యూఏఈ వ్యాపారవేత్త మురారి లాల్ జలన్, కార్లక్ క్యాపిటల్లు కలిసి జెట్ ఎయిర్వేస్ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఎన్సీఎల్టీ, ఇతర రెగ్యులేటరీ అప్రూవల్స్ కోసం ఎదురు చూస్తున్నామని, జెట్ ఎయిర్వేస్ స్లాట్స్ను తిరిగి చేతికి తెచ్చుకునేందుకూ ప్రయత్నాలు సాగుతున్నాయని సోమవారం కొనుగోలుదారులు ప్రకటించారు. బైలేటరల్ ట్రాఫిక్ రైట్స్ కోసం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవిషయేషన్ (డీజీసీఏ)తో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. ఒకసారి సర్వీసులు మొదలెట్టాక, ప్రత్యేక ఫ్రైటర్ సర్వీసులనూ అందుబాటులోకి తేవాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. జెట్ ఎయిర్వేస్ రివైవల్ కోసం సబ్మిట్ చేసిన ప్లాన్ను కమిటీ ఆఫ్ క్రెడిటార్లు అక్టోబర్ నెలలోనే ఆమోదించారు. లిక్విడిటీ సంక్షోభంతో జెట్ ఎయిర్వేస్ ఆపరేషన్స్ గత ఏడాది ఏప్రిల్ 17 న నిలిచిపోయాయి. అదే ఏడాది జూన్లో జెట్ ఎయిర్వేస్ కేసు ఎన్సీఎల్టీకి వెళ్లింది. జెట్ ఎయిర్వేస్కు గతంలో ఉన్న అన్ని రూట్లనూ నడపాలనుకుంటున్నట్లు రిజొల్యూషన్ ప్లాన్లో పేర్కొన్నారు. ఇందులో డొమెస్టిక్, ఫారిన్ సర్వీస్లు రెండూ ఉన్నాయి. జెట్ ఎయిర్వేస్కు పాత వైభవం తెచ్చేందుకు జెట్ 2.0 పేరిట ప్రోగ్రామ్ చేపట్టినట్లు కొనుగోలుదారులు వెల్లడించారు. దేశంలో కొత్త ఎయిర్లైన్స్ను లాంఛ్ చేద్దామనుకున్నాం. కానీ, జెట్ ఎయిర్వేస్కి ఉన్న మంచి బ్రాండ్ వాల్యూ, బలాలనూ చూసిన తర్వాత దానినే కొనసాగిద్దామనుకున్నామని కూడా కొనుగోలుదారులు తెలిపారు. జెట్ ఎయిర్వేస్ బ్రాండ్ గత 25 ఏళ్లుగా దేశంలోనూ, బయటా కూడా బాగా పాపులరైందని పేర్కొన్నారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరులలో జెట్ హబ్స్ యధాప్రకారం కొనసాగుతాయని, టైర్ 2, టైర్ 3 సిటీల కోసం కొత్తగా సబ్ హబ్స్ ఏర్పాటు చేసే ప్రపోజల్ పరిశీలిస్తున్నామని వెల్లడించారు. చిన్న సిటీలకు విమాన సర్వీస్లు విస్తరించాలనే ప్రభుత్వ ప్లాన్కు మద్దతుగా నిలుస్తామని పేర్కొన్నారు. కార్గో సర్వీస్లనూ బాగా విస్తరించాలనుకుంటున్నట్లు తెలిపారు.