ఆర్థిక సమస్యలతో మూతబడ్డ జెట్ ఎయిర్వేస్ జూలై 1 నుంచి మళ్లీ తన కార్యకలాపాలు ప్రారంభించబోతుందా..? అంటే అవుననే వినిపిస్తోంది. లండన్ అడిగో గ్రూప్కు చెందిన అడిగ్రో ఏవియేషన్ జెట్ ఎయిర్వేస్కు తాజాగా ఆఫర్ ఇచ్చింది. అనుమతి ఇస్తే జూలై 1 నుంచి జెట్ ఆపరేషన్స్ రీస్టార్ట్ చేయాలని అడిగ్రో ప్రతిపాదిస్తోంది. జెట్ ఎయిర్వేస్లో వాటాలు కొనేందుకు అడిగ్రో గ్రూప్ ఆసక్తి చూపింది. ఎతిహాద్తో కలిసి తాము పనిచేసేందుకు ఆసక్తితో ఉన్నామని, 25 ఏళ్ల ఈ ఎయిర్లైన్ సంస్థను కోలుకునేలా చేస్తామని అడిగ్రో గ్రూప్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ సంజయ్ విశ్వనాథన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. 8000 నుంచి 9000 మంది ఉద్యోగులతో, 70 ఎయిర్క్రాఫ్ట్లతో ఆపరేషన్స్ మళ్లీ ప్రారంభించాలని ఈ కంపెనీ కోరుకుంటోంది.
ఉన్నతాధికారులు త్యాగాలు చేయాలి
లండన్కు చెందిన ఈ కంపెనీ ఆరు ప్లాన్లను జెట్ లెండర్స్ ముందు ఉంచింది. కంపెనీలో ఉన్న ఉన్నతాధికారులు తమ వేతనాల్లో 25 శాతం కోత పెట్టుకోవాలని కంపెనీ భావిస్తోందని విశ్వనాథన్ చెప్పారు. ఇతర ఉద్యోగులు కూడా 10 శాతం వేతనాలను వదులుకోవాలని కోరారు. వీటికి రిటర్న్గా ఈఎస్పీఓలను(ఎంప్లాయీ స్టాక్ ఓనర్షిప్ ప్లాన్ను) ఆఫర్ చేయనున్నట్టు పేర్కొన్నారు. ‘ప్రాక్టికల్ హెయిర్కట్ను మాత్రమే మేము కోరుతున్నాం. దానికి ప్రతిఫలంగా ఈక్విటీని ఇవ్వనున్నాం. మా బిడ్డింగ్ కూడా ఈక్విటీ కాంపోనెంట్లోనే ఉంది’ అని ఓ ఇంగ్లీష్ న్యూస్పేపర్కు చెప్పారు. జెట్ ఎయిర్వేస్ను పునరుద్ధరించడానికి లెండర్స్ కన్సార్షియం ఎస్బీఐ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఎతిహాద్ మైనార్టీ వాటాలను కొనేందుకు మాత్రమే ముందుకు రావడంతో, ఆసక్తి ఉన్న మిగిలిన బిడ్డర్లతో కూడా ఎస్బీఐ చర్చలు జరుపుతోంది. వారిలో అడిగ్రో ఏవియేషన్ కూడా ఉంది.
జెట్ను పునరుద్ధరించడానికి అడిగ్రో ఏవియేషన్ కూడా బిడ్ వేసింది. ఎతిహాద్తో టచ్లోనే ఉందని విశ్వనాథన్ చెప్పారు. ఈ ఎయిర్లైన్ను పునరుద్ధరించడానికి తమకు సుమారు రూ.5 వేల నుంచి రూ.6 వేల కోట్లు కావాలని ఎతిహాద్తో, ఎస్బీఐతో చర్చలు జరిపిన తర్వాత ఈ అంచనాలకు వచ్చామని విశ్వనాథన్ తెలిపారు. అడిగ్రో గ్రూప్ లండన్కు చెందిన విదేశీ కంపెనీ. ఎఫ్డీఐ నిబంధనల ప్రకారం ఇండియన్ ఏవియేషన్ లో 49 శాతానికి మించి వాటాలు పొందడానికి లేదు. దీంతో ఎతిహాద్తో కలిసి వాటాలు కొనేందుకు చూస్తోంది. జెట్ను పునరుద్ధరించడానికి ఎతిహాద్తో అడిగ్రో భాగస్వామ్యం కుదుర్చుకుంటామని విశ్వనాథన్ స్పష్టం చేశారు.
