న్యూక్లియర్‌‌ టెక్ కోసం జిందాల్ వెతుకులాట.. ఫ్రాన్స్‌ కంపెనీ ఈడీఎఫ్‌, అమెరికా కంపెనీ వెస్టింగ్‌ హౌస్‌తో చర్చలు

న్యూక్లియర్‌‌ టెక్ కోసం జిందాల్ వెతుకులాట..  ఫ్రాన్స్‌ కంపెనీ ఈడీఎఫ్‌, అమెరికా కంపెనీ వెస్టింగ్‌ హౌస్‌తో చర్చలు

న్యూఢిల్లీ:   నవీన్ జిందాల్ గ్రూప్ న్యూక్లియర్‌‌ పవర్ సెక్టార్‌‌‌‌లోకి ఎంట్రీ ఇవ్వడానికి చర్యలు ముమ్మరం చేసింది.  న్యూక్లియర్‌‌ పవర్ ప్లాంట్ల ఏర్పాటు కోసం న్యూక్లియర్‌‌‌‌‌‌ టెక్నాలజీ సంస్థలతో చర్చలు ప్రారంభించింది. ఫ్రాన్స్‌‌కు చెందిన ఈడీఎఫ్, అమెరికాకు చెందిన వెస్టింగ్‌‌హౌస్‌‌లతో పాటు ప్రభుత్వ రంగ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌‌పీసీఐఎల్‌‌) తో టెక్నాలజీ సరఫరాపై  చర్చలు జరుపుతోంది.  

జిందాల్ గ్రూప్ వివిధ రాష్ట్రాల్లో సుమారు రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడితో 18 గిగావాట్ల (జీడబ్ల్యూ) న్యూక్లియర్‌‌ పవర్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2047 నాటికి 100 గిగావాట్ల న్యూక్లియర్‌‌ పవర్‌‌‌‌ సామర్థ్యాన్ని సాధించాలనే ప్రభుత్వ లక్ష్యానికి ఇది ఊతమివ్వనుంది. ఈడీఎఫ్ సంస్థకు చెందిన 1,650 మెగావాట్ల ఈపీఆర్ (ఈపీఆర్‌‌‌‌) రియాక్టర్లు, వెస్టింగ్‌‌హౌస్‌‌కు చెందిన 1,150 మెగావాట్ల ఏపీ1000 రియాక్టర్లు, ఎన్‌‌పీసీఐఎల్‌‌కి చెందిన స్వదేశీ 700 మెగావాట్ల పీహెచ్‌‌డబ్ల్యూఆర్ (పీహెచ్‌‌డబ్ల్యూఆర్‌‌‌‌) టెక్నాలజీలను కంపెనీ పరిశీలిస్తోంది. 

సేఫ్టీ, కాస్ట్ ఆధారంగా తుది నిర్ణయం తీసుకోనున్నారు.  జిందాల్ గ్రూప్ అనుబంధ సంస్థ 'జిందాల్ న్యూక్లియర్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్', ఆంధ్రా, తమిళనాడు, గుజరాత్, ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్‌‌గఢ్ వంటి రాష్ట్రాల్లో అనువైన స్థలాలను పరిశీలిస్తోంది.