ప్రేమించి పెండ్లి చేసుకున్నరని పోలీస్ స్టేషన్​లోనే కొట్టిన్రు..

ప్రేమించి పెండ్లి చేసుకున్నరని పోలీస్ స్టేషన్​లోనే కొట్టిన్రు..
  • పరుగులు తీసిన ప్రేమ జంట.. వెంట పడిన బంధువులు 
  • బైక్​పై ఎక్కించుకుని   ఎస్పీ ఆఫీసుకు తీసుకువెళ్లిన పోలీసులు

గద్వాల, వెలుగు : జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల రూరల్ పోలీస్ స్టేషన్ లో మంగళవారం సాయంత్రం ఓ ప్రేమ జంటపై అమ్మాయి బంధువులు దాడి చేశారు. ప్రత్యక్ష సాక్షు ల కథనం ప్రకారం..గద్వాల మండలం పూడూరు కు చెందిన శిరీష(22), గద్వాల టౌన్ రాఘవేంద్ర కాలనీకి చెందిన ప్రశాంత్ (25) కొన్నేండ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. సోమవారం కర్నూల్ జిల్లా ఓర్వకల్లు దగ్గర పెండ్లి చేసుకున్నారు. అమ్మాయి తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉందని మంగళవారం గద్వాల రూరల్ పీఎస్​కు వచ్చారు. దీంతో అమ్మాయి పేరెంట్స్​ ను పీఎస్​కు పిలిపించారు. ఈ క్రమంలో ప్రశాంత్, శిరీష మేజర్లమని, ఇష్టపూర్వకంగానే పెండ్లి చేసుకున్నామని సంతకాలు చేస్తుండగా శిరీష తల్లిదండ్రులు దాడికి దిగారు. తమను కాదని ఎలా పెండ్లి చేసుకుంటావంటూ చేయి చేసుకున్నారు. దీంతో వారు భయంతో పోలీస్ స్టేషన్ నుంచి బయటపడి రోడ్డుపై పరుగులు పెట్టారు. అమ్మాయి బంధువులు వెంటపడగా పోలీసులు బైక్​పై వారిని ఎక్కించుకొని ఎస్పీ ఆఫీస్ కు తరలించారు. అక్కడి నుంచి గద్వాల టౌన్ పీఎస్​కు తీసుకువెళ్లారు. రెండు నెలల తర్వాత పెండ్లి చేస్తామని అమ్మాయి బంధువులు చెప్పారని, వినకపోవడంతో దాడి చేస్తారనే అనుమానంతో అబ్బాయి తరపు వారు అమ్మాయిని బయటికి లాక్కెళ్లడంతో గొడవ జరిగిందని రూరల్​ఎస్ఐ ఆనంద్​ తెలిపారు. స్టేషన్​లో ఎలాంటి దాడి జరగలేదన్నారు.