- అధికారం కోసం రజాకార్ల వారసులను కౌగిలించుకుంటవా.. కేసీఆర్?
- గల్లీ ఎన్నికలకు జాతీయ నేతలు వస్తున్నరని ఆగమైతున్నవ్
- హైదరాబాద్.. గల్లీ కాదు మహానగరం
- లీడర్ ప్రజల ఆస్తులను కాపాడాలె.. నీలాగా స్వాహా చేయకూడదు
- కేంద్ర పథకాలు ప్రజలకు చేరకుండా కేసీఆర్ అడ్డుకుంటున్నడు
- బీహార్లో గెలిచినం.. ఇక్కడా గెలుస్తం: ఇంటలెక్చువల్ మీట్లో నడ్డా
- అంతకుముందు కొత్తపేట నుంచి నాగోల్ దాకా రోడ్షో
- వర్షంలోనూ పెద్దసంఖ్యలో తరలివచ్చిన జనం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ, అవినీతి పాలనను అంతం చేయడానికి ఎంత దూరమైనా, ఏ గల్లీకైనా వస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పష్టం చేశారు. తెలంగాణలో కేసీఆర్ ఫ్యామిలీ, ఎంఐఎం నేతలదే రాజ్యమా అని ప్రశ్నించారు. అధికారం కోసం రజాకార్ల వారసులను కౌగిలించుకుంటవా కేసీఆర్ అని నిలదీశారు. శుక్రవారం తాజ్ బంజారాలో జరిగిన ఇంటలెక్చువల్స్ మీటింగ్కు నడ్డా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘కేంద్రం నిధులు ఇస్తే అవినీతికి పాల్పడుతున్నాడు. గల్లీ ఎన్నికలకు జాతీయ నేతలు ఎందుకు వస్తున్నారని కేసీఆర్ ఆగమైతున్నాడు. హైదరాబాద్ గల్లీ కాదు మహానగరం. 74 లక్షల మంది ఓటర్లు.. 5 లోక్సభ స్థానాలు.. 24 అసెంబ్లీ స్థానాలు ఉన్న సిటీ గల్లీలా కనబడుతోందా? ఇదేనా ప్రజాస్వామ్యం?” అని ప్రశ్నించారు. ‘‘కేసీఆర్, ఆయన ఫ్యామిలీ, కొడుకు, కూతురు, అల్లుడు, ఆయన ఫ్రెండ్స్అయిన ఎంఐఎం నేతలదే రాజ్యమా. అసదుద్దీన్ ఒవైసీ కూడా జోర్దార్ ఉన్నడు.
‘‘కేసీఆర్, ఆయన ఫ్యామిలీ, కొడుకు, కూతురు, అల్లుడు, ఆయన ఫ్రెండ్స్అయిన ఎంఐఎం నేతలదే రాజ్యమా. అసదుద్దీన్ ఒవైసీ జోర్దార్ ఉన్నడు. 1947 ఆగస్టు 15 నుంచి 1948 సెప్టెంబరు 17 దాకా రజాకార్లు ఏం చేశారో గుర్తు చేసుకో కేసీఆర్. ఇప్పుడు ఆ రజాకార్ల వారసులను కౌగిలించుకుంటున్నవ్” అని విమర్శించారు. లీడర్ ప్రజల ఆస్తులకు రక్షకుడిగా ఉండాలి కానీ స్వాహా చేసేలా ఉండకూడదని విమర్శించారు. అవినీతిని అంతం చేయడానికి, సుపరిపాలన అందించడానికి ఎక్కడికైనా, ఎంత దూరమైనా వస్తామని స్పష్టం చేశారు.
అధికార మార్పిడి జరగాలె
ఎయిమ్స్, మెట్రోకు కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ అందించిందని, రాష్ట్రంలో పథకాలకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తోందని చెప్పారు. కానీ కేంద్ర సంక్షేమ పథకాల లబ్ధిని తెలంగాణ ప్రజలకు అందనీయడం లేదని టీఆర్ఎస్పై మండిపడ్డారు. 26 లక్షల మందికి ఆయుష్మాన్ భారత్ అందకుండా కేసీఆర్ చేశారని ఆరోపించారు. ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాలంటే రాష్ట్రంలో అధికార మార్పిడి జరగాలన్నారు. హైదరాబాద్ మార్పుకు మేధావులు నాంది పలకాలని, కేసీఆర్ కుటుంబ పాలనను అంతం చేయడానికి బయటికి రావాలని పిలుపునిచ్చారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి భారీ విజయం అందించాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని, అందుకే మద్దతు పలికేందుకు ప్రజలు ముందుకొస్తున్నారని తెలిపారు.బీహార్లో గెలిచామని, ఇప్పుడు తెలంగాణలోనూ గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
కేసీఆర్.. మీలా హామీలు మరిచిపోం
కేసీఆర్ మాదిరిగా తాము హామీలను మరిచిపోబోమని జేపీ నడ్డా చెప్పారు. రాజకీయాలను ప్రధాని మోడీ మార్చేశారని, అభివృద్ధి రిపోర్ట్తో ఎన్నికలకు పోతున్నారని తెలిపారు. ఐదేళ్ల క్రితం బీహార్లో ఇచ్చిన హామీలను మోడీ అమలు చేశారని గుర్తు చేశారు. ప్రజల కోసం బీజేపీ పని చేస్తుందని, అందుకే ప్రజలు తమ పార్టీకి పట్టం కడుతున్నారని తెలిపారు.
కరోనా కాలంలో 130 కోట్ల మందిని ఆదుకున్నం
కరోనా కట్టడిలో భాగంగా లాక్డౌన్ టైంలో 130 కోట్ల మందిని మోడీ రక్షించారని నడ్డా తెలిపారు. 6 లక్షల మంది మహిళలకు 3 గ్యాస్ సిలిండర్ల చొప్పున, 20 కోట్ల మందికి రూ.500 చొప్పున, 5 కిలోల బియ్యం, కిలో కందిపప్పు అందించారని తెలిపారు. దివ్యాంగులకు రూ.వెయ్యి అందించారని చెప్పారు. వోకల్ ఫర్ లోకల్ కోసం పని చేస్తున్నామని, పోచంపల్లి హ్యాండ్ల్యూమ్ వంటి ఉత్పత్తులను విశ్వవ్యాప్తం చేస్తున్నామని అన్నారు. ‘‘2014లో స్వచ్ఛ్ భారత్ అనేది ఓ ఇష్యూనా అని అన్నారు. కానీ మేం 11 కోట్ల టాయ్లెట్స్ కట్టించాం. తెలంగాణలో 29 లక్షల టాయ్లెట్స్ కట్టించాం” అని చెప్పారు. తెలంగాణకు రూ.1,028 కోట్లతో ఎయిమ్స్ హాస్పిటల్, సైనిక్ స్కూల్ మంజూరు చేశామని వివరించారు. ‘‘సామాన్యుడు మోడీ.. ప్రధాన మంత్రి అయ్యారు. సామాన్యుడు బండి సంజయ్.. బీజేపీకి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు. ఇతర పార్టీల్లో ఇది సాధ్యమా? ప్రజలు, మేధావులు ఆలోచించాలి” అని చెప్పారు.
1,600 కరోనా హాస్పిటళ్లు పెట్టినం
కరోనాను హ్యాండిల్ చేయలేకే అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఓడిపోయారని నడ్డా అన్నారు. ‘‘కరోనా వచ్చిన మొదట్లో దేశంలో ఒకటే వైరాలజీ ల్యాబ్ ఉండేది. రోజుకు 1,500 టెస్ట్లు చేసేందుకే అవకాశం ఉండేది. మోడీ అందుకే దేశంలో లాక్డౌన్ ప్రకటించారు. అప్పటికి కరోనా కోసం ఒక్క డెడికేటెడ్ హాస్పిటల్ కూడా లేదు.. ఈ క్రమంలో 1,600 డెడికేటెడ్ హాస్పిటల్స్, 1,600 ల్యాబ్స్ ఏర్పాటు చేశాం. కరోనా టెస్టింగ్ కెపాసిటీని రోజుకు 1,500 నుంచి 15 లక్షలకు పెంచాం” అని నడ్డా వివరించారు.
వర్షంలోనూ ఘన స్వాగతం
శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట్ ఎయిర్ పోర్టుకు నడ్డా చేరుకున్నారు. బీజేపీ ఓబీసీ మోర్చా నేషనల్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ తో పాటు ఇతర నేతలు ఆయనకు స్వాగతం పలికారు. తర్వాత కొత్తపేట రోడ్ షోలో నడ్డా పాల్గొన్నారు. ఆయనకు వర్షంలోనూ ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో స్వాగతం పలికారు. పూలజల్లు కురిపించారు. తనపై చూపిన అభిమానానికి ప్రతిగా నడ్డా కూడా జనంపై పూలు చల్లారు.
కేసీఆర్ కూతురునుచిత్తుగా ఓడించినం
హైదరాబాద్లో మార్పు అనివార్యమని నడ్డా అభిప్రాయపడ్డారు. దుబ్బాకలో బీజేపీని గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ‘‘2014 లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 10.5 శాతం ఓట్లు, ఒక ఎంపీ సీటు గెలుచుకున్నాం. 2019 ఎన్నికల్లో 23.5 శాతం ఓట్లు, 4 ఎంపీ సీట్లు సాధించాం. దుబ్బాక ఉప ఎన్నికలో 38.47 శాతం ఓట్లు సాధించాం” అని తెలిపారు. గత లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ కూతురును 70 వేల ఓట్లతో చిత్తుగా ఓడించామని చెప్పారు.
టీఆర్ఎస్ పోయే టైమ్ వచ్చింది
రాష్ట్రంలో టీఆర్ఎస్ పోయే టైమ్, బీజేపీ వచ్చే టైమ్ వచ్చిందని నడ్డా చెప్పారు.హైదరాబాద్ ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి డివిజన్లో కమలం వికసించాలన్నారు. గ్రేటర్లో పార్టీని గెలిపించాలన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నడ్డా శుక్రవారం కొత్తపేట చౌరస్తా నుంచి నాగోల్ వరకు చేపట్టిన రోడ్ షోలో పాల్గొన్నారు. ఆయనతోపాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు.
