
- బీఆర్ఎస్కు వీఆర్ఎస్సే..
- దోచుకోవడం, దాచుకోవడమే ఇక్కడి సర్కారు పని
- మంత్రులు, ఎమ్మెల్యేలు లూటీ చేస్తున్నరు
- కేసీఆర్కు ఫ్యామిలీ పాలన తప్ప ప్రజా సంక్షేమం పట్టదు
- అమరుల కుటుంబాలను మోసం చేసిండు
- సర్ ప్లస్ స్టేట్ను అప్పుల ఊబిలోకి దింపిండు
- ప్రజల ఆస్తుల దోపిడీకే ధరణి పోర్టల్ తెచ్చిండు
- అవినీతి, కుటుంబ పాలనను వ్యతిరేకించేవాళ్లంతా కలిసి రావాలని పిలుపు
- ముగిసిన ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర
హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ను గద్దె దించేది బీజేపీ మాత్రమేనని, రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఎవరైతే కేసీఆర్ సర్కారు పోవాలని కోరుకుంటున్నారో.. కేసీఆర్ అవినీతి, కుటుంబపాలనను వ్యతిరేకిస్తున్నారో వారంతా తమతో కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. దోచుకోవడం, దాచుకోవడమే కేసీఆర్ సర్కార్ పనిగా పెట్టుకున్నదని, ఈ ఏటీఎం సర్కార్కు పతనం తప్పదని హెచ్చరించారు. గురువారం కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్స్లో జరిగిన ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో జేపీ నడ్డా మాట్లాడారు. వేములవాడ రాజన్న, కొండగట్టు అంజన్నను ప్రార్థిస్తూ ప్రసంగాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ప్రజలను, అమరవీరుల కుటుంబాలను కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు. ‘‘కేసీఆర్ది ప్రజావ్యతిరేక ప్రభుత్వం.. ఈ సర్కార్కు కొనసాగే అర్హత లేదు. కేసీఆర్కు గుడ్బై చెప్పాల్సిన టైమ్ వచ్చింది. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కమలం వికసించడం, కేసీఆర్కు విశ్రాంతి ఇవ్వడం ఖాయం” అని అన్నారు.
సాలు దొర.. సెలవు దొర..
బండి సంజయ్ ఆధ్వర్యంలో గత 114 రోజులు, 56 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1,481 కిలోమీటర్ల మహాసంగ్రామ యాత్ర చేపట్టి ప్రజల బాధలను తెలుసుకున్నారని నడ్డా తెలిపారు. ‘‘ఈ యాత్ర ఆరంభం మాత్రమే.. ఇది ఆగేది కాదు. ప్రజా గోస- – బీజేపీ భరోసా కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది. నేతలందరం వస్తాం.. ప్రతి ఊరు, ప్రతి ఇంటికి వెళ్తాం.. రాష్ట్ర ప్రజలకు వెన్నంటి నిలుస్తాం.. ‘సాలు దొర.. సెలవు దొర..’ నినాదంతో ముందుకు కదులుతాం” అని ఆయన చెప్పారు.
రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిండు..
‘‘కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సబ్కా సాత్.. సబ్కా వికాస్ అనే నినాదంతో పేద, బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేస్తున్నది. ఆదివాసీ మహిళను రాష్ట్రపతిని చేసింది. 20 మంది వెనుకబడిన వర్గాల వారికి మంత్రి పదవులు ఇచ్చింది.. ఇది ఎవరైనా ఊహించారా?” అని నడ్డా అన్నారు. కేసీఆర్ మాత్రం సర్ప్లస్ రాష్ట్రాన్ని రూ.3.29 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టారని ఆయన మండిపడ్డారు. ‘‘కేసీఆర్ మాట్లాడితే రిచ్చెస్ట్ స్టేట్ అంటడు.. దాన్ని నేను కరెక్ట్ చేస్తున్నా.. రిచ్ స్టేట్గా ఉన్న రాష్ట్రాన్ని పూర్ స్టేట్గా మార్చిన ఘనత కేసీఆర్దే” అని దుయ్యబట్టారు. ‘‘తెలంగాణలో ఓ సామెత ఉంది.. ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానన్నట్లు కేసీఆర్ కలలు కంటున్నడు” అని నడ్డా తెలుగులో మాట్లాడారు. ‘‘కేసీఆర్ బీఆర్ఎస్తో రావడం కాదు.. వీఆర్ఎస్ తీసుకునే సమయం దగ్గరికి వచ్చింది” అని ఆయన అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ అవినీతి మైక్రో లెవల్ నుంచి కొనసాగుతున్నదని, సీఎం ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా అవినీతిపరులుగా మారి ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని ఆరోపించారు. ‘‘సాక్షాత్తు సీఎం కేసీఆర్ కుమార్తెను సీబీఐ ప్రశ్నించింది. ఆయన కుటుంబం అవినీతిలో మునిగిపోయింది. తెలంగాణ ప్రజల ఆస్తుల దోచుకునేందుకే ధరణి పోర్టల్ తెచ్చిండు” అని దుయ్యబట్టారు.
వెల్నెస్ సెంటర్కు డూప్లికేటే బస్తీ దవాఖాన
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 1.50 లక్షల వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నదని, వెల్నెస్ సెంటర్లను కేసీఆర్ బస్తీ దవాఖానగా పేరు మార్చి చీటింగ్ చేస్తున్నారని నడ్డా దుయ్యబట్టారు. ‘‘చీటింగ్ చేసే వారు ఒరిజినల్ కాదు.. వాళ్లు డూప్లికేట్.. మేమే ఒరిజినల్..” అని చెప్పారు. కేంద్రం గత ఐదేండ్లలో రాష్ట్రంలో 4,996 కిలోమీటర్లు హైవేలను నిర్మించిందని ఆయన వెల్లడించారు. ఫోర్ లేన్, ఫ్లైఓవర్, ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించామని వివరించారు. లోకల్ బాడీస్ను కేంద్రమే ఆదుకొని సాయం చేస్తున్నదని తెలిపారు. ‘‘నిరంకుశ నిజాం, రజాకార్లకు వ్యతిరేకంగా ఉద్యమించిన నేల తెలంగాణ. సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవాన్ని ఒవైసీతో కలిసి ఈ రాష్ట్ర సర్కార్ నిర్వహించకుండా చేస్తే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్వహించింది” అని నడ్డా పేర్కొన్నారు. హుజూరాబాద్లో బీజేపీని గెలిపించారని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ రాష్ట్రంలో ప్రజలు బీజేపీని గెలిపిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ‘‘కేసీఆర్ అవినీతి, కుటుంబ పాలనను వ్యతిరేకించేవాళ్లు ఒకటే గుర్తుంచుకోవాలి.. కేసీఆర్ను గద్దె దించే దమ్ము బీజేపీకి మాత్రమే ఉందని. అందరూ కలిసి రావాలి. ఈ అవినీతి సర్కార్ను గద్దె దించుదాం” అని ఆయన పిలుపునిచ్చారు.
తెలంగాణ వచ్చాక దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్ హామీ
ఏమైంది? ఆయనకు కుటుంబ పాలన తప్ప ప్రజాసంక్షేమం పట్టదు. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన వారిని అవమానించిండు. సీఎం ఫామ్ హౌస్ కట్టుకున్నడు కానీ పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు మాత్రం ఇయ్యలేదు. ఎస్సీ, ఎస్టీలకు 3 ఎకరాల భూ పంపిణీ అని చెప్పి ముంచిండు. రుణమాఫీ, కేజీ టు పీజీ ఉచిత విద్య, యువతకు
రూ. 3,016 నిరుద్యోగ భృతి.. వంటి హామీలు ఏమైనయ్?
- జేపీ నడ్డా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు