ప్రాణాపాయస్ధితిలో ఉన్న అభిమాని కుటుంబానికి ధైర్యం చెప్పారు టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్. జనార్ధన్ అనే వ్యక్తి ఎన్టీఆర్ కు వీరాభిమాని. ప్రస్తుతం అతని ఆరోగ్యం విషమంగా ఉండటంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్.. జనార్ధన్ తల్లితో మాట్లాడి ధైర్యం చెప్పారు. అధైర్యపడోద్దని... మనమందరం దేవుడిని ప్రార్ధించి కాపాడుకుందామని, త్వరలోనే అతడు కోలుకుని వస్తాడని భరోసా ఇచ్చాడు. జనార్ధన్ తో ఫోన్ స్పీకర్ ద్వారా మాట్లాడిన ఎన్టీఆర్.. నిన్ను చూడాలని ఉంది. త్వరగా కోలుకుని వచ్చేయ్ అంటూ చెప్పాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అటు ఎన్టీఆర్ అభిమానులు కూడా జనార్ధన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.