తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 'అందాల రాక్షసి'గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి, మెగా కోడలు లావణ్య త్రిపాఠి కొణిదెల . అయితే గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా వేధింపులకు గురవుతున్నట్లు ఆమె తెలిపారు. తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా, తన కుటుంబాన్ని కించపరిచేలా పోస్టులు పెడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ లావణ్య హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.
ఏం జరిగింది?
గత కొంతకాలంగా ‘పర్పుల్ క్రెయాన్00’ (Purple Crayon00) అనే ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తనని లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన పోస్టులు, కామెంట్లు పెడుతున్నట్లు లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.. కేవలం నటిగానే కాకుండా, వ్యక్తిగతంగా ఆమె నైతిక విలువలను ప్రశ్నిస్తూ, తప్పుడు ఆరోపణలతో పరువుకు భంగం కలిగించేలా ఆ అకౌంట్ నిర్వాహకులు వ్యవహరిస్తున్నారు. ఇది తన మానసిక ప్రశాంతతను దెబ్బతీయడమే కాకుండా, తన కుటుంబ గౌరవానికి కూడా ముప్పు కలిగిస్తోందని లావణ్య తన ఫిర్యాదులో ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధింత ఇన్ స్టా ఖాతాదారుడిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని, వెంటనే ఆ ఖాతా ద్వారా చేసిన పోస్టులను తొలగించేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆమె కోరారు.
విచారణ చేపట్టిన పోలీసులు..
లావణ్య ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఈ వ్యవహారంలో ప్రధానంగా డిజిటల్ మాధ్యమాల దుర్వినియోగానికి సంబంధించి కింది సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఐటీ చట్టం సెక్షన్ 67, భారత న్యాయ సంహిత (BNS) సెక్షన్ 78 & 79 కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం సైబర్ క్రైమ్ అధికారులు ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ యొక్క ఐపీ అడ్రస్, ఇతర సాంకేతిక ఆధారాల ద్వారా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు.
ఒకవైపు వ్యక్తిగత జీవితంలో ఇటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నా, లావణ్య తన వృత్తిపరమైన బాధ్యతలపై దృష్టి సారిస్తూనే ఉన్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన 'సతీ లీలావతి' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. వాస్తవానికి ఈ సినిమా మార్చి 6, 2026న విడుదల కావాల్సి ఉండగా, కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. త్వరలోనే చిత్ర యూనిట్ కొత్త విడుదల తేదీని ప్రకటించనుంది.
