చెన్నై: ఎఫ్ఐహెచ్ మెన్స్ జూనియర్ హాకీ వరల్డ్ కప్లో ఇండియా సెమీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఇండియా పెనాల్టీ షూటౌట్లో 4–3తో బలమైన బెల్జియంపై గెలిచింది. హోరాహోరీగా సాగిన మ్యాచ్లో నిర్ణీత సమయంలో ఇరు జట్ల స్కోరు 2–2తో సమం కావడంతో షూటౌట్ను నిర్వహించారు.
ఇందులో శ్రద్దానంద్ తివారీ మూడు గోల్స్ కొట్టాడు. అంకిత్ పాల్ ఒకసారి బంతిని గోల్ పోస్ట్లో పంపాడు. మధ్యలో గోల్ కీపర్ ప్రిన్స్దీప్ రెండుసార్లు ప్రత్యర్థులు కొట్టిన షాట్లను అద్భుతంగా అడ్డుకుని ఇండియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
అంకిత్ కొట్టిన షాట్పై బెల్జియం రివ్యూకు వెళ్లింది. స్టిక్ బ్యాక్సైడ్ బాల్కు తాకిందని ఫిర్యాదు చేయగా.. రీప్లే బ్యాట్ సరిగానే తాకిందని తేలింది. ఇక 60 నిమిషాల రెగ్యులర్ టైమ్లో ఇండియా తరఫున రోహిత్ (45వ ని), శ్రద్ధానంద్ తివారీ (48వ ని) గోల్స్ చేయగా, కార్నెజ్ మసంత్ గాస్పర్డ్ (13వ ని), నాథన్ రొగ్గి (59వ ని) బెల్జియంకు గోల్స్ అందించారు. సెమీస్లో ఇండియా.. జర్మనీతో తలపడుతుంది.
అమ్మాయిల గెలుపు
చిలీలోని శాంటియాగోలో జరుగుతున్న విమెన్స్ వరల్డ్ కప్లో ఇండియా అమ్మాయిల జట్టు కూడా అందరగొట్టింది. పూల్–సి చివరి లీగ్ మ్యాచ్లో ఇండియా 4–0తో ఐర్లాండ్ను చిత్తుగా ఓడించింది.పూర్ణిమా (42, 58వ ని) డబుల్ గోల్స్తో సత్తా చాటగా... కనికా సివాచ్ (12వ ని), సాక్షి రాణా (57వ ని) చెరో గోల్తో జట్టును గెలిపించారు. మూడు మ్యాచ్ల్లో రెండో విజయంతో 6 పాయింట్లు సాధించిన ఇండియా రెండో ప్లేస్లో నిలిచింది.
