పార్టీ మారగానే వివేక్పై ఐటీ, ఈడీ దాడులా : జస్టిస్ చంద్రకుమార్

పార్టీ మారగానే వివేక్పై ఐటీ, ఈడీ దాడులా : జస్టిస్ చంద్రకుమార్

హైదరాబాద్ సోమాజిగూడలో ‘‘తెలంగాణలో అవినీతి ఆర్థిక, దోపిడీ రాజకీయాలను ఓడిద్దాం’’,  ‘‘మత విద్వేష, విభజన నియంతృత్వ పాలనతో ఆదానీ, అంబానీలకు సేవ చేస్తున్న వారిని ఓడిద్దాం’’ అనే అంశాలపై సమావేశం నిర్వహించారు. జాగో (మేలుకో) తెలంగాణ, తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో బస్సు యాత్ర ముగింపు సందర్భంగా ఈ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాగో మేలుకో తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు జస్టిస్ చంద్రకుమార్, ప్రధాన కార్యదర్శి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి, కమిటీల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

జాగో తెలంగాణ బస్సుయాత్ర సందర్భంగా ప్రజల నుండి మంచి స్పందన వచ్చిందన్నారు జస్టిస్ చంద్రకుమార్. దేశ సమగ్రతకు మత కల్లోలాలు మంచివి కావని చెప్పారు. దేశాభివృద్ధికి హిందువు, ముస్లింల ఐక్యత ఎంతో అవసరం అని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఒక్కటే అన్నారు. ఈడీ,  సీబీఐ అధికారులు ఎంఐఎం పార్టీ నేతలపై విచారణ జరపరని చెప్పారు. దేశంలోని నేరస్తులను బీజేపీ ప్రభుత్వం సత్ప్రవర్తన కింద జైలు నుండి విడుదల చేస్తోందన్నారు. బీజేపీలో వివేక్ వెంకటస్వామి ఉన్నన్నీ రోజులు మంచోడు... పార్టీ మారిన వెంటనే ఐటీ దాడులు చేపిస్తున్నారని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో కేసీఆర్ ను ఓడించాలని పిలుపునిచ్చారు. 

జాగో తెలంగాణ బస్సుయాత్ర విజయవంతంగా పూర్తైందని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 198 మీటింగులు పెట్టామన్నారు. బస్సుయాత్రతో 29 జిల్లాల్లో తమ బృందం పర్యటించిందని చెప్పారు. సీఎం కేసీఆర్ శిష్యులు కొందరు తమ బస్సుయాత్రను ఆపేందుకు ప్రయత్నించారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు బీఆర్ఎస్ పార్టీనీ ఓడిస్తామని చెబుతున్నారని చెప్పారు. 

బీఆర్ఎస్ నాయకుల భూ దందాలు, ఇసుక మాఫియా, ప్రాజెక్టుల కమీషన్లను ప్రజలు గుర్తు పెట్టుకున్నారని చెప్పారు ఆకునూరి మురళి. కేటీఆర్ మాటలకు నిరుద్యోగ యువత నవ్వుకుంటున్నారని తెలిపారు. 35 లక్షల మంది నిరుద్యోగులు కారు గుర్తుకు ఓట్లు వేయరన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాని వాళ్లు కేసీఆర్ కు ఓట్లు వేయరని చెప్పారు. దళిత బంధు విషయంలో కూడా దాదాపుగా 40 లక్ష మంది కారుకు ఓట్లు వేయరన్నారు. గ్రామ స్థాయిలో బీఆర్ఎస్ పై పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారని తెలిపారు.