- దళితుల సమస్యలపై పోరాడండి.. అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకెళ్లండి: రాహుల్
- కాంగ్రెస్ ఎస్సీ విభాగం మీటింగ్లో దిశానిర్దేశం
- హాజరైన డిప్యూటీ సీఎం భట్టి, ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, కడియం కావ్య
న్యూఢిల్లీ, వెలుగు: దేశవ్యాప్తంగా దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడాలని పార్టీ నేతలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకెళ్లాలని సూచించారు. శనివారం ఢిల్లీలోని కాంగ్రెస్ హెడ్డాఫీస్ ఇందిరా భవన్లో పార్టీ ఎస్సీ విభాగం చైర్మన్ రాజేంద్రపాల్ ఆధ్వర్యంలో అడ్వయిజరీ కమిటీ సమావేశం జరిగింది. ఇందులో రాహుల్, కేసీ వేణుగోపాల్, ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ ఎస్సీ విభాగం నేషనల్ కోఆర్డినేటర్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎంపీ కావ్య, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతమ్, ఎస్సీ సెల్ బాధ్యులు, ఇతర ఎస్సీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్.. దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. వాటి పరిష్కారానికి పార్టీ నేతల నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఎస్సీల కోసం భవిష్యత్తులో పార్టీ తీసుకోనున్న నిర్ణయాలను ప్రకటించారు.
కాంగ్రెస్తోనే దళితులకు న్యాయం: గడ్డం వంశీకృష్ణ
కాంగ్రెస్తోనే దళితులకు న్యాయం జరుగుతుందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. అడ్వైజరీ కమిటీ మీటింగ్ తర్వాత ఏఐసీసీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశాన్ని మనుస్మృతి ఐడియాలజీతో నడిపిస్తున్నాయని విమర్శించారు. ఈ ఆలోచన విధానాలు దేశానికి అస్సలు మంచివి కాదన్నారు. బీజేపీ విధానాలను ఎలా తిప్పికొట్టాలనే దానిపై రాహుల్ దిశానిర్దేశం చేశారని చెప్పారు. దళితుల సమస్యలపై అంబేద్కర్ స్ఫూర్తితో పోరాడాలని సూచించారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ హెడ్డాఫీసుకు కడియం..
తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల కేసు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి శనివారం ఢిల్లీలోని కాంగ్రెస్ హెడ్డాఫీసు ఇందిరా భవన్కు వచ్చారు. ఈ కేసుపై సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణ, అసెంబ్లీ స్పీకర్ చర్యలపై ఉత్కంఠ నెలకొన్న టైమ్లో కడియం కాంగ్రెస్ ఆఫీసుకు రావడం చర్చనీయాంశంగా మారింది.
కడియం తన కూతురు కావ్యతో కలిసి ఎస్సీ విభాగం అడ్వయిజరీ కమిటీ మీటింగ్ హాల్లోకి వెళ్లారు. అక్కడ పలువురు నేతలను కలిశారు. అనంతరం పార్టీ ఆఫీసు నుంచి బయటకు వచ్చారు. ఆ టైమ్లో మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. తన కుతూరు మాట్లాడుతుందని చెప్పి వెళ్లిపోయారు. అనంతరం కడియం కావ్య మాట్లాడుతూ.. ‘‘నా కోసమే నాన్న ఢిల్లీకి వచ్చారు. కాంగ్రెస్ కొత్త పార్టీ ఆఫీసు చూపించడానికి ఆయనను తీసుకొచ్చాను. భవిష్యత్ కార్యాచరణ మీకే తెలుస్తుంది” అని పేర్కొన్నారు.
