జస్టిస్ సుదర్శన్‌‌రెడ్డికి ‘రావి నారాయణరెడ్డి’ జాతీయ పురస్కారం

జస్టిస్ సుదర్శన్‌‌రెడ్డికి ‘రావి నారాయణరెడ్డి’ జాతీయ పురస్కారం
  • రేపు సీఎం రేవంత్​ రెడ్డి చేతులమీదుగా ప్రదానం 

హైదరాబాద్, వెలుగు: సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, దేశంలో ఎన్నో చారిత్రాత్మక తీర్పులను వెలువరించిన జస్టిస్​ బి.సుదర్శన్‌‌రెడ్డికి ప్రతిష్టాత్మక ‘రావి నారాయణరెడ్డి స్మారక జాతీయ అవార్డు’ దక్కింది. 2025 సంవత్సరానికిగాను ఈ అవార్డుకు ఆయన్ను ఎంపిక చేసినట్లు తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్ ప్రకటించింది. శనివారం  హైదరాబాద్‌‌లోని మగ్ధూం భవన్‌‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో అవార్డు వివరాలను ట్రస్ట్​ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌‌రెడ్డి, సెక్రటరీ కందిమళ్ల ప్రతాపరెడ్డి వెల్లడించారు. 

సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు లోటస్​ పాండ్‌‌లోని రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్​ రెడ్డి హాజరై.. జస్టిస్​ సుదర్శన్‌‌రెడ్డికి అవార్డును అందజేయనున్నారని చెప్పారు. అనంతరం ‘భారత రాజ్యాంగం– భావప్రకటన స్వేచ్ఛ’ అనే అంశంపై జస్టిస్​ సుదర్శన్​ రెడ్డి స్మారకోపన్యాసం చేస్తారన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం భూమి కోసం భుక్తి కోసమే కాకుండా 200 ఏండ్లకు పైగా నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడేందుకు సాగిన మహోత్తర పోరాటమని, దీని ఫలితంగానే హైదరాబాద్‌‌ సంస్థానం మనదేశంలో విలీనమైందని తెలిపారు.