క్లారిటీ ఇచ్చిన రాజ్యసభ సెక్రటేరియెట్
బీజేపీ స్టేట్ ఆఫీస్కు అందిన లెటర్
మలుపు తిరిగిన ‘తుక్కుగూడ మున్సిపల్ ’ వివాదం
హైదరాబాద్, వెలుగు: రాజ్యసభ సభ్యుడు కే. కేశవరావు ఏపీ కోటా నుంచి ఎంపీగా ఉన్నారని రాజ్యసభ సెక్రటేరియెట్ క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు రాజ్యసభ కార్యదర్శి దీపక్ కల్రా.. బీజేపీ స్టేట్ చీఫ్ లక్ష్మణ్కు మంగళవారం ఎంపీల జాబితా పంపించారు. ఏపీ కోటాలో ఎంపీగా ఉన్న కేకే.. తెలంగాణ కోటాలో ఎక్స్అఫీషియో ఓటు వేయడంపై బీజేపీ రాష్ట్ర నేతలు శనివారం రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన రాజ్యసభ.. కె.కేశవరావు తెలంగాణ కోటాలో లేరని వివరణ ఇచ్చింది. ఈ పరిణామం టీఆర్ఎస్ను ఇరకాటంలో పడేసింది.
రాజ్యసభ క్లారిటీ ఇవ్వడంతో కేకేతోపాటు ఆయన ఓటు వేయడానికి సహకరించిన రిటర్నింగ్ అధికారి, ఇతర అధికారులపై చర్యలు తీసుకోవాలని బుధవారం హైకోర్టులో కేసు వేస్తామని బీజేపీ తెలిపింది.
తుక్కుగూడలో ఏం జరిగింది?
తుక్కుగూడ మున్సిపాలిటీలో మొత్తం 15 మంది కౌన్సిలర్లకు 9 మంది బీజేపీ, ఐదుగురు టీఆర్ఎస్, ఇండిపెండెంట్(బీజేపీ రెబల్) ఒకరు గెలిచారు. ఇక్కడ చైర్మన్, వైఎస్ చైర్మన్ పదవులు బీజేపీకి దక్కాల్సి ఉండడంతో టీఆర్ఎస్ ఇక్కడ ఏకంగా ఐదుగురు ఎక్స్అఫీషియో సభ్యులను రంగంలోకి దింపి ఇండిపెండెంట్గా గెలిచిన బీజేపీ రెబల్ను చైర్మన్గా ఎంపిక చేసింది. దీనిపై భగ్గమన్న బీజేపీ.. కేకే ఓటు వేయడాన్ని తప్పుపట్టింది. తెలంగాణ కోటాలో ఉన్న కేవీపీని నేరేడుచర్లలో ఓటు వేయకుండా అడ్డుకున్న అధికారులు, ఏపీ కోటాలో ఉన్న కేకేను ఇక్కడ ఎలా ఓటు వేయడానికి అనుమతిస్తారని ప్రశ్నించింది. దీనిపై రాజ్యసభ చైర్మన్కు ఫిర్యాదు చేయడంతో స్పష్టత వచ్చింది.
కోర్టుకు పోతం
రాజ్యసభ సెక్రటరీ క్లారిటీ ఇచ్చారు. తుక్కుగూడలో కేకే అక్రమంగా ఓటు వేశారని మేం మొదటి నుంచీ చెబుతున్నం. ఆయనపై చర్యలు తీసుకోవాలని హైకోర్టులో కేసు వేస్తం. కేకేతోపాటు ఆయన ఓటు వేసేందుకు సహకరించిన అధికారులపైనా చర్యలు తీసుకోవాలని కోర్టును కోరుతం. – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్