
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సీఎం కేసీఆర్ కుటుంబం 9 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ఈ మేరకు కేసీఆర్ కుటుంబ సభ్యుల అవినీతిపై సీబీఐ డైరెక్టర్ సుబోద్ కుమార్ జైశ్వాల్ ను కలిసి పిర్యాదు చేశారు పాల్. అనంతరం ఆయన మాట్లాడుతూ. రాష్ట్రప్రజలంతా సీఎం కేసీఆర్ అవినీతిపై విచారణ జరగాలని కోరుతున్నారని అన్నారు. కేసీఆర్ కుటుంబానికి ఆదాయానికి మించి ఉన్న ఆస్తులపై దర్యాప్తు జరపాలని పాల్ డిమాండ్ చేశారు.
రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు 60 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉందన్న పాల్.. కేసీఆర్ సర్కార్ అధికారంలోకి వచ్చి నాలుగున్నర లక్షల కోట్ల అప్పు చేసిందని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణలతో పాటూ సింగపూర్, దుబాయ్, అమెరికాలో అనేక ఆస్తులు కూడబెట్టారని అన్నారు. అటు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కూడా భారీగా అవినీతికి పాల్పడ్డారని, ప్రాజెక్టు అంచనా బడ్జెట్ లక్షా 5 వేల కోట్లు కాగా 35 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని అన్నారు.
ఇక యాదాద్రి అభివృద్ధిలోనూ అవినీతి జరిగిందని, 2 వేల కోట్ల అంచనా లో 200 కోట్లు ఖర్చు చేసి అంతా దోచుకున్నారని పాల్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ అవినీతి అక్రమాలపై, బినామీ లావాదేవీల పై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు బయట పెట్టాలని, ప్రభుత్వ ఖజానాకు న్యాయం చెయ్యాలని పాల్ కోరారు.
ఇక కేసీఆర్ అవినీతిని ప్రశ్నిస్తున్నందుకు తనపై దాడులు చేస్తున్నారన్నారు పాల్. కేసీఆర్ అవినీతి అక్రమాలపై జరిగే దర్యాప్తుకు తన నుంచి పూర్తి సహకారం ఉంటుందని అన్నారు. సీబీఐతో పాటూ కేంద్రమంత్రులు అమిత్ షా, పురుషోత్తం రూపాలాకు పిర్యాదు కాపీలను పంపించారు పాల్.