17 ఎంపీ స్థానాలు గెలిపించి నీ మగతనాన్ని నిరూపించుకో: కడియం

17 ఎంపీ స్థానాలు గెలిపించి నీ మగతనాన్ని నిరూపించుకో: కడియం

 

  • నీ కుర్చీ ఇనాం కింద వచ్చిందే
  • ప్రభుత్వాన్ని కూల్చాలన్న ఆలోచన లేదు
  • త్వరలో మేడిగడ్డకు కేసీఆర్   
  • సీఎం రేవంత్ పై ఎమ్మెల్యే కడియం ఫైర్​

వరంగల్: రాజకీయాల్లో మగతనం మాట ఎందుకు వస్తుందని సీఎం రేవంత్​రెడ్డిని బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే  కడియం శ్రీహరి ప్రశ్నించారు. ఇవాళ మీడయాతో మాట్లాడుతూ ‘మహిళా నాయకత్వంలో పనిచేస్తూ నువ్వు మగతనం గురించి మాట్లాడ్డం హాస్యాస్పదం. నువ్వు అంత మగాడివే అయితే తెలంగాణలో 17 ఎంపీ స్థానాలు గెలిపించి నీ మగతనాన్ని నిరూపించుకో ’ అని రేవంత్ రెడ్డికి సవాల్​విసిరారు.  మీ ప్రభుత్వాన్ని కూల్చాలన్న ఆలోచన బీఆర్​ఎస్​కు లేదన్నారు.


మీ అంతట మీరే కూలిపోతే మాకు సంబంధం లేదన్నారు. మీ వాళ్లతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నీ కుర్చీ ఇనాం కింద వచ్చిందే అనుకుంటున్నామన్నారు. రాజీవ్ గాంధీ కుటుంబం ఇనామ్ కింది ఇచ్చిందే కదా నీ కుర్చీ అని దెప్పి పొడిచారు.  మీది జాతీయపార్టీ కాదు, ప్రాంతీయ పార్టీ  అని మండిపడ్డారు. ఆప్ కంటే అధ్వాన్నంగా కాంగ్రెస్ పార్టీ మారిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం మేడిగడ్డ బ్యారేజ్ ఒక్కటే కాదని, మేడిగడ్డకు పెట్టిన ఖర్చు కేవలం  రూ.3 వేల కోట్లు మాత్రమేనన్నారు. కుంగిపోయిన 3 పిల్లర్లను  రిపేర్ చేసి ప్రజలను ఆదుకోవాలని సూచించారు. బ్యారేజ్ కొట్టుకుపోయేలా చేయాలనే దుర్మార్గపు ఆలోచన ప్రభుత్వం చేస్తుందని మండిపడ్డారు. త్వరలో కేసీఆర్ కూడా మేడిగడ్డకు వస్తారని తెలిపారు. 

ALSO READ :- కిషన్​ రెడ్డికి వ్యవసాయం గురించి తెలియదు: కాంగ్రెస్​ మ్మెల్సీ జీవన్​రెడ్డి

ఆరు గ్యారంటీల అమలుపై ప్రశ్నిస్తే సీఎంలో అసహనం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందన్నారు.  మానిఫెస్టో పైన తామ చర్చకు రెడీ అని కడియం శ్రీహరి అన్నారు. హామీలపై ప్రశ్నిస్తే  మాటల దాడి చేస్తున్నారని పేర్కొన్నారు. సీఎం ఎందుకు భయపడుతున్నారో అర్దం కావడం లేదన్నారు. రేవంత్ రెడ్డి సీఎం కుర్చీ పైన కూర్చున్న తర్వాత భాష మార్చుకుని, హుందాగా ఉంటారని భావించామని, కానీ  సహనం కోల్పోయి జుగుప్సాకరంగా  మాట్లాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్​పై సీఎం వ్యాఖ్యలు తెలంగాణ ప్రతిష్టను జాతీయస్థాయిలో దిగజార్చేలా ఉన్నాయన్నారు. ఇది మంచిదికాదని, కాంగ్రెస్ పెద్దలు ఆలోచించాలని సూచించారు.