ఎమ్మెల్సీ పదవులకు  కడియం, పల్లా, పాడి రాజీనామా

ఎమ్మెల్సీ పదవులకు  కడియం, పల్లా, పాడి రాజీనామా
  • కౌన్సిల్​లో ఖాళీ అయిన ఆరు స్థానాలు

హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్సీ పదవులకు కడి యం శ్రీహరి, పల్లా రాజేశ్వర్​రెడ్డి, పాడి కౌశిక్​రెడ్డి రాజీనామా చేశారు. శనివారం మండలి చైర్మన్​ గుత్తా సుఖేందర్​రెడ్డికి రాజీనామా లేఖలు అందజేశారు.  కడియం,  కౌశిక్​రెడ్డి ఎమ్మెల్యే కోటాలో, పల్లా రాజేశ్వర్​రెడ్డి నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్​ఘన్​పూర్ ​నుంచి కడియం, జనగామ నుంచి పల్లా, హుజూరాబాద్​ నుంచి కౌశిక్​రెడ్డి ఎమ్మెల్యేలుగా గెలుపొందిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ పదవులకు వారు రిజైన్​ చేశారు. వారి రాజీనామాలను చైర్మన్​ ఆమోదించారు. కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మహబూబ్​నగర్ ​స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇప్పటికే రాజీనామా చేశారు. దీంతో కౌన్సిల్​లో 4 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయినట్టు సెంట్రల్​ఎలక్షన్ ​కమిషన్​కు సమాచారం ఇచ్చారు. గవర్నర్ ​కోటాలో రెండు ఎమ్మెల్సీ సీట్లు ఇప్పటికే ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు నలుగురు రాజీనామా చేయడంతో కౌన్సిల్​లో మొత్తం ఆరు స్థానాలు ఖాళీ అయ్యాయి.