అసెంబ్లీలో గవర్నర్ స్పీచ్ పై రియాక్ట్ అయ్యారు స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ప్రభుత్వ పాలసీల గురించి గవర్నర్ ప్రసంగంలో క్లారిటీ లేదన్నారు. గవర్నర్ తో ప్రభుత్వం అసత్యాలు చెప్పించిందన్నారు. ధాన్యం కొనుగోలుపై గవర్నర్ స్పీచ్ లో స్పష్టత లేదన్నారు. గవర్నర్ ప్రసంగం కాంగ్రెస్ మేనిఫెస్టోను చదివినట్లే ఉందని విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కడియం మాట్లాడారు.
గత ప్రభుత్వాన్ని విమర్శించేందుకే గవర్నర్ ప్రసంగం పెట్టారని ఫైరయ్యారు కడియం శ్రీహరి. జాతీయ స్థాయిలో తెలంగాణ అనేక అవార్డులు సొంతం చేసుకుందని గతంలో చెప్పారు. ఇప్పుడు గవర్నర్ ఈ అంశాలన్నింటినీ మర్చిపోయినట్లున్నారని ఎద్దేవా చేశారు. అబద్ధాలు చెప్పడం గవర్నర్ పదవిని అవమానించినట్లే అవుతుందన్నారు. ప్రభుత్వం శ్వేతపత్రాలు ప్రకటించిన తరువాత అన్ని అంశాలపై మాట్లాడుతామని కడియం స్పష్టం చేశారు.