- ఆఫీసర్ల లెక్కల్లో అరకొర మాత్రమే
- కొంతమంది సిబ్బందిపై అవినీతి ఆరోపణలు
- టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసినా చర్యలు శూన్యం
హనుమకొండ, వెలుగు: కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ(కుడా), వరంగల్ బల్దియా పరిధిలో అక్రమ వెంచర్ల దందా ఆగడం లేదు. ఎన్ని కంప్లైంట్స్వచ్చినా ఆఫీసర్ల నుంచి ఎలాంటి యాక్షన్ లేకపోవడం, క్షేత్రస్థాయిలో కొంతమంది సిబ్బంది లంచాలకు అలవాటుపడడంతో రియల్టర్లు యథేచ్ఛగా ఇల్లీగల్ బిజినెస్ చేస్తున్నారు. జిల్లా స్థాయిలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసినా.. ఇంతవరకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. గతంలోనే స్పెషల్ డ్రైవ్లు చేపట్టి అక్రమ వెంచర్ల భరతం పడతామని చెప్పిన ఆఫీసర్లు.. ఇంతవరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు.
వెంచర్లు వందల్లో.. లెక్కలు మాత్రం పదుల్లోనే..
వరంగల్ సిటీ చుట్టూ వందల సంఖ్యలో వెంచర్లు ఏర్పాటవుతున్నాయి. ప్రధానంగా రింగ్ రోడ్డు చుట్టూరా ఉన్న వ్యవసాయ భూముల్ని నాలా కన్వర్షన్ లేకుండానే ప్లాట్లు చేసి అమ్మేస్తున్నారు. లేఅవుట్ ఏర్పాటుకు పది శాతం ల్యాండ్ ను గుడి, బడి, పార్కులు ఇలా కనీస అవసరాల కోసం కేటాయించాల్సి ఉన్నా.. పట్టించుకోవడం లేదు. రింగ్ రోడ్డు స్టార్ట్ అయ్యే కరుణాపురం నుంచి దామెర క్రాస్వరకు ఏర్పాటైన అన్ని వెంచర్లలో ఇదే పరిస్థితి. ఇందులో అన్ని రకాల పర్మిషన్లు ఉన్నవి 10 శాతం లోపే. కానీ ఆఫీసర్ల లెక్కల్లో మాత్రం ఆ సంఖ్య కనిపించడం లేదు. జీడబ్ల్యూఎంసీ పరిధిలో మొత్తంగా 14 అక్రమ లే అవుట్లు ఉండగా.. కుడా పరిధిలో 200 వరకు ఉన్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఆ సంఖ్య నాలుగైదు రెట్లకు మించి ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
లైట్ తీసుకుంటున్న ఆఫీసర్లు
అక్రమ వెంచర్లు, లేఅవుట్ల విషయంలో ఎక్కడైనా ఫిర్యాదులు వస్తే ఆఫీసర్లు నామమాత్రంగా చర్యలు తీసుకుని, వదిలేస్తున్నారు. ఇంకొన్ని చోట్లా కనీస యాక్షన్ కూడా ఉండటం లేదు. కొన్నిచోట్ల కుడా, జీడబ్ల్యూఎంసీ సిబ్బంది సమన్వయం లేకుండా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటితో పాటు క్షేత్రస్థాయి సిబ్బంది అవినీతికి అలవాటు పడటం కూడా ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఎల్కతుర్తి మండలం ఎల్కతుర్తి, చింతలపల్లి గ్రామాల పరిధిలోని ఓ తొమ్మిది ఎకరాల భూమిలో వెంచర్ ఏర్పాటు చేస్తున్నారు. ఓ మాజీ ఎంపీపీ కుడాలోని ఓ పెద్దాఫీసర్ సహకారం, జడ్పీ చైర్మన్ సపోర్ట్ తో ఎలాంటి అనుమతులు లేకుండానే ఈ వెంచర్ ఏర్పాటు చేస్తుండగా.. స్థానిక రెవెన్యూ ఆఫీసర్లు కూడా ఇందుకు సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. వరంగల్ పైడిపల్లి, కొత్తపేటలోని ఈదుల చెరువును ఆక్రమించి వెంచర్ ఏర్పాటు చేసినట్లు ఆఫీసర్లు తేల్చినా దానిపైనా చర్యలు కనిపించడం లేదు. దామెర సమీపంలో ఓ పొలిటికల్ లీడర్ ఏర్పాటు చేసిన వెంచర్ కు సరైన అనుమతులు లేకున్నా యాక్షన్ కరువైంది. వర్ధన్నపేట, ఐనవోలు సమీపంలో ఓ వ్యాపారి ఏర్పాటు చేసిన వెంచర్లది కూడా ఇదే పరిస్థితి. వరంగల్ నుంచి నర్సంపేట, ఖమ్మం రూట్లతో పాటు రింగ్ రోడ్డు చుట్టుపక్కలా ఈ అక్రమ లేఅవుట్ల దందా జోరుగా సాగుతోంది. ఇదంతా ఆఫీసర్లకు తెలిసినా అక్రమార్కులపై మున్సిపల్ యాక్ట్ 2019 ప్రకారం చర్యలు తీసుకోవాల్సింది పోయి.. లైట్ తీసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది.
టాస్క్ ఫోర్స్ ఉన్నా.. లేనట్టే..!
నాలాల ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు, అనాథరైజ్డ్ లే అవుట్లపై యాక్షన్ తీసుకునేందుకు జిల్లా స్థాయిలో గతంలోనే టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో వరంగల్ సీపీ, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు, గ్రేటర్ కమిషనర్, ఇతర ఆఫీసర్లు సభ్యులుగా ఉంటారు. అయితే ఈ కమిటీ ఇల్లీగల్ కన్ స్ట్రక్షన్స్తో పాటు అక్రమ వెంచర్లపైనా యాక్షన్ తీసుకోవాల్సి ఉంది. కానీ అక్రమ లేఅవుట్లను గుర్తించకపోగా.. ఆపై ఎలాంటి యాక్షన్ తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రేటర్ పరిధి వరకు అడపాదడపా అక్రమ లే ఔట్ల కాంపౌండ్లు కూల్చేస్తున్నా.. కుడా మాత్రం ఆ విషయాన్నే గాలికొదిలేసిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇకనైనా అక్రమ లే అవుట్లపై సీరియస్ యాక్షన్ తీసుకోవడంతో పాటు నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
టాస్క్ ఫోర్స్ రివ్యూ..
నాలాల ఆక్రమణలు, అక్రమ లేఅవుట్లు, వరద నివారణ చర్యలపై శనివారం టాస్క్ ఫోర్స్ కమిటీ రివ్యూ నిర్వహించింది. సీపీ డా.తరుణ్జోషి, కలెక్టర్లు రాజీవ్ గాంధీ హనుమంతు, గోపి, కమిషనర్ ప్రావీణ్య, ఇతర ఆఫీసర్లు పాల్గొన్నారు. సిటీ పరిధిలోని నయీంనగర్, బొంది వాగు, భద్రకాళి, శాకరాసి కుంట, కట్టమల్లన్న, చిన్న వడ్డేపల్లి నాలాల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. అక్రమ నిర్మాణాలు, అక్రమ లే అవుట్లపై చర్యలు తీసుకోవాలని, కొత్తగా దరఖాస్తు చేసుకునేవారికి ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించే విధంగా అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు సంధ్యారాణి, హరీసింగ్, డీసీపీలు వెంకట లక్ష్మి, అశోక్ కుమార్, ఆర్ అండ్ బీ, ఐబీ ఎస్ఈ లు సుధాకర్ రెడ్డి, నాగేందర్ రావు, సిటీ ప్లానర్ బి.వెంకన్న, ఆర్డీవోలు వాసుచంద్ర, మహేందర్ జీ, సర్వే ల్యాండ్ ఏడీ ప్రభాకర్ రావు, ఏసీపీ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.