తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన కాళేశ్వరం కమిషన్

తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన కాళేశ్వరం కమిషన్

హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ తెలంగాణ ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పించింది. ఈ మేరకు ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జాకు ఫైనల్ రిపోర్ట్ అందజేసింది. గురువారం (జూలై 31) హైదరాబాద్ బీఆర్కే భవన్లోని కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ కార్యాలయంలో 650 పేజీలతో కూడిన తుది రిపోర్టును రెండు సీల్డ్ కవర్లలో రాహుల్ బొజ్జాకు అందజేసింది. 

కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‎లో భాగమైన మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బారాజ్‎ల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 2024, మార్చి 14న జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో ఏర్పాటైన ఏకసభ్య న్యాయవిచారణ కమిషన్‌ దాదాపు 15 నెలల పాటు విచారణ జరిపింది. 

ఈ బారాజ్‎లకు సంబంధించిన డీపీఆర్, డిజైన్లను పరిశీలించిన కమిషన్.. విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా ఇరిగేషన్ శాఖ అధికారులు, కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులను విచారించింది. విచారణలో భాగంగా అప్పటి సీఎం కేసీఆర్, ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావును కూడా కమిషన్ ఇన్విస్టిగేట్ చేసింది. 

అధికారులు, క్రాంటాక్టర్లు, రాజకీయ నాయకులు ఇలా మొత్తం 115 మందిని విచారించి వారి స్టేట్మెంట్లు రికార్డ్ చేసింది కమిషన్. వారి వాంగ్మూలాలను విశ్లేషించి తుది రిపోర్టును తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించింది. కాళేశ్వరం ఫైనల్ రిపోర్ట్ ప్రభుత్వానికి చేరడంతో అందులో ఏముందనే దానిపై స్టేట్ పాలిటిక్స్‎లో ఉత్కంఠ నెలకొంది. ఈ రిపోర్టుపై ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో చూడాలి.